వైఎస్ పాలిట మరో 'సూరి'
ఈ సూర్యనారాయణ ఎపిసోడ్ లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ముప్పై వేల జీతగాడు వందకోట్లకు ఎలా పడగెత్తాడు? ఇతర శాఖల్లోని సివిల్ కాంట్రాక్టులను ఫిషరీస్ శాఖకు అంటే తనకు వచ్చేలా ఎలా మేనేజ్ చేయగలిగాడు? ఆ చెక్కులు కూడా తన పేరు మీద వచ్చేలా ఎలా చూసుకోగలిగాడు. అతను మంత్రులను, ఉన్నతాధికారులను తన మాటకారితనంతో వలలో వేసుకుని మందు/మగువ/మనీలతో లొంగదీసుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు ప్రాంతాల నుంచి అందమైన యువతులను రప్పించి ఉన్నతాధికారుల వద్దకు పంపేవాడట. వారు తాము మత్స్యశాఖ ఉద్యోగులుగా, సూర్యనారాయణ అసిస్టెంట్ లుగా పరిచయం చేసుకుని అల్లుకుపోయేవారని ఇప్పుడు బయట పడింది. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగినులు కాబట్టి తమకు రిస్క్ ఉండదని భావించిన మంత్రులు, ఉన్నతాధికారులు "మరదలు సయ్యా" అంటూ రెచ్చిపోయారట.
మగువ/మనీ/మందు- ఈ వినూత్న సినిమాకు దర్శకత్వం వహించిన సూర్యనారాయణ ఎన్నో ఏళ్ళు విజయవిహారం చేశాడు. అతి వినయం అతని లక్షణం. అడ్డదారిలో కోట్లు దండుకోవడం అతని గమ్యం. ఐఎ ఎస్ అధికారులంటే అమ్మాయిల ముందు చొంగలు కాల్చుకునే వారని అతని నమ్మకం. సూర్యనారాయణ విషయంలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి అప్రదిష్ట పాలయ్యారు. ఆయనను ముఖ్యమంత్రి సమర్ధిస్తున్నా ప్రజల దృష్టిలో ఆ అత్యున్నత పదవి అభాసు పాలైంది.
ఇంత అవినీతి పరుడిపైన, ఆయనకు సహకరించిన వారి మీద ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక మాజీ న్యాయ మూర్తితో న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ విచారణతో ఒరిగేదేమీ ఉండదని, తనకున్న ధన బలంతో పెద్ద లాయర్లను పెట్టుకుని సూర్యనారాయణ ఎసిబి కేసుల నుంచి సునాయాసంగా బయటపడగలరని విశ్లేషకులూ చెబుతున్నారు. ఈ అవినీతి మయ సమాజంలో, రాజకీయ దొంగల హయాంలో ఏదైనా సాధ్యమేనని నిరూపించిన సూర్యనారాయణ కోటి సన్మానాలకు అర్హుడు.