వైఎస్ కు డిఎస్ ఎసరు?
అయితే ఈసారి కాంగ్రెస్ గెలిచినా వైఎస్ కు అవకాశం ఇవ్వకూడదని, వీలుంటే డిఎస్ కు పట్టం కట్టాలని కాంగ్రెస్ హై కమాండ్ యోచిస్తున్నట్టు డిఎస్ శిబిరంలో ఒక మసాలా వార్త ప్రచారంలో ఉంది. మరోసారి వైఎస్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఆయన హై కమాండ్ కు ఏకు మేకు అవుతారని అనుమానం ఉంది. అదీగాక వైఎస్ ఇందిరా కాంగ్రెస్ ను విడిచిపెట్టి తన మనుషులతో వైఎస్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన ప్రత్యర్ధులు ఇప్పటికే హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపధ్యంలో హై కమాండ్ కు, ముఖ్యంగా సోనియాగాంధీకి వీర విధేయుడైన డి శ్రీనివాస్ రహస్యంగా పావులు కదుపుతున్నారు. తాను నిజామాబాద్ జిల్లాకు మాత్రమే నాయకుడిని కానని, తాను రాష్ట్రం మొత్తానికి నాయకుడినని నేడు శ్రీనివాస్ అనడం మారిన పరిస్ధితులకు ఒక సంకేతం. గత ఎన్నికల సమయంలో కూడా శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. వైఎస్ లాబీయింగ్ కారణంగా ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. రెండోసారి పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టినప్పుడు సోనియాగాంధీ " ఈసారి నువ్వే ముఖ్యమంత్రివి" అని హామీ ఇచ్చినట్టు డిఎస్ సన్నిహితులు చెప్పుకుంటున్నారు. టికెట్ల కేటాయింపులో వైఎస్ మాటను కాదనకుండా డిఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హై కమాండ్ కు ఆయన మీద సదభిప్రాయం ఉంది. వైఎస్ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం వల్ల హై కమాండ్ మరో వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్టు కన్పిస్తోంది.