కాంగ్రెస్ దెబ్బ తిన్న పులి చిరంజీవి!
కాంగ్రెస్ తో పొత్తు అనగానే అల్లు అరవింద్ ప్యాంట్ గుండీలు కూడా పెట్టుకోనంత తొందరగా పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ను కలుసుకున్నారు. డిఎస్ తో కేరళలో ఉన్న చిరంజీవికి ఫోన్ చేయించారు. చిరంజీవి పార్టీతో పొత్తు అనగానే కాంగ్రెస్ లో జగన్ వర్గం కస్సుమంది. పొత్తు ప్రతిపాదన ఏమీ లేదని హై కమాండ్ ప్రతినిధులు చెప్పిన తర్వాత అది బెడిసికొట్టడానికి తామే కారణమంటూ జగన్ వర్గీయులు మిఠాయిలు పంచుకున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని స్ధానాలకు పోటీ చేస్తానంటోంది. ప్రజారాజ్యం కూడా అన్ని స్ధానాల్లో తమ అభ్యర్ధులు ఉంటారని వెల్లడించింది. కమ్యూనిస్టులతో కయ్యాలున్నా తెలుగుదేశం పార్టీ వారికి నామమాత్రంగా కొన్ని స్ధానాలు ఇచ్చి అధిక స్ధానాల్లో తన అభ్యర్ధులను నిలబెట్టాలనుకుంటోంది.
ఆంజనేయుడికి తన బలం తనకు తెలియనట్టుంది చిరంజీవి వ్యవహారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో డివిజన్లు చిన్న చిన్నవి. సరైన అభ్యర్ధులను ఎంపిక చేసుకుని (అల్లు అరవింద్ లాగా సినిమా ఫక్కీలోఏరియాలు అమ్ముకోకుండా ఉంటే) ప్రతి కాలనీలో బస్తీలో చిరంజీవి స్వయంగా ప్రచారం చేస్తే, పాత బస్తీ మినహా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్, టిడిపి అభ్యర్ధులను ఓడించే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి అలా చేస్తే తమకు ప్రజారాజ్యం పెద్ద థ్రెట్ అవుతుందని చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన సన్నిహిత నాయకుల వద్ద అంటున్నట్టు తెలుస్తోంది.
ఇంత అవకాశమున్నా చిరంజీవి కాంగ్రెస్ తో పొత్తు కోసం తహతహలాడడం ప్రజారాజ్యం పార్టీ గ్రేటర్ నాయకుల అసంతృప్తికి కారణమవుతోంది. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీకి కోరుకున్న ఎన్నికల చిహ్నం వచ్చింది. అధి నాయకుడిలో కొద్దో గొప్పో రాజకీయ పరిపక్వత కన్పిస్తోంది. ఈ నేపధ్యంలో చిరంజీవి సొంత బలంతో ముందుకు వచ్చి కాస్తో కూస్తో నూతన రాజకీయాలకు తెరతీసినట్టు అవుతుంది. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు నాలుగు లక్షల ఓట్లు వచ్చాయి.