వైఎస్ ప్రమాదం వెనుక కుట్ర లేదు
హెలికాప్టర్ కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో పైలెట్ల మామూలు సంభాషణలు మాత్రమే రికార్డు అయ్యాయి. మరి కొద్ది సెకన్లలో ప్రమాదం జరగబోతుందనగా పైలట్లకు తెలిసి ఉండవచ్చని ఉన్నతాధికార వర్గాలు ఈ పత్రికకు వెల్లడించాయి. రుద్రకోడూరు కొండల ఎత్తును పైలట్లు సడన్ గా గుర్తించారు. హెలికాప్టర్ ను పైకి లేపడానికి ప్రయత్నించారు. అప్పటికే పరిస్ధితి చేజారిపోయింది. నలుగురు సభ్యులున్న దర్యాప్తు సంఘం నవంబర్ మొదటి వారంలో నివేదిక సంర్పించనుంది. ఈ సంఘానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని పవన్ హాన్స్ హెలికాప్టర్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ కె త్యాగి నాయకత్వం వహిస్తున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి చెందిన "సాక్షి" పత్రిక వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఏదో కుట్ర ఉండవచ్చని వార్తా కథనాలను ప్రచురించింది. వాటిని వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఖండించారు. ఈ కథనాలపై కాంగ్రెస్ హై కమాండ్ కూడా జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జగన్ దీనిపై సవివరంగా చెప్పుకుని తాత్కాలికంగా ఆ గండం నుంచి బయటపడినట్టు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెలికాప్టర్, అదీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నప్పుడు కూల్చేయడానికి కుట్ర జరిగినట్టు వచ్చిన వార్తలు నమ్మశక్యంగా లేవు. వాతావరణం తీవ్ర మేఘావృతమై ఉన్నప్పుడు హెలికాప్టర్ ప్రయాణం ప్రమాదకరమని, ఎదురుగుండా ఏమి ఉన్నాయో, ఏ కొండ ఎంత ఎత్తున ఉన్నదో పైలెట్లు కనుచూపు ద్వారా తెలుసుకోవాల్సిందేనని, ఒక రకంగా ఇది గుడ్డి ప్రయాణమేనని విమానయానశాఖ నిపుణులు చెప్పారు.