'సత్యం' రాజు మోసాల చిట్టా
సిఐడి పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తారన్న విమర్శలు ఉన్నప్పటికీ వారు సైంటిఫిక్ గానే రామలింగరాజును విచారించి వివరాలు రాబడుతున్నట్టు సమాచారం. రామలింగ రాజు 6,000 పైగా బోగస్ శాలరీ అకౌంట్లను వివిధ బ్యాంకుల్లో నిర్వహిస్తున్న విషయాన్ని నేడు ఎన్ డిటివి పరిశోధక బృందం బయటపెట్టడంతో సిఐడి అధికారులు ఆ దిశగా కూడా దృష్టి సారించారు. ఈ శాలరీ అకౌంట్లను తెరిచే సమయంలో రాజు కేవైసి నిబంధనలను అతిక్రమించి ఉండవచ్చు.
సత్యం రామలింగరాజు 42 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఉంది. వేలాది కోట్ల స్కాంకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్న సీఐడీ అధికారులు ఈ 42 ప్రశ్నలు రూపొందించారు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న రామలింగరాజు నుంచి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గడిచిన ఏడేళ్లుగా సంస్థలో కొనసాగిన వ్యవహారాల గురించి ఈనెల 7న బహిరంగలేఖ ఎందుకు రాయా ల్సి వచ్చింది? దీనిని ఎవరి సహకారంతో రూపొందించారు? అనేవాటితో ఈ ప్రశ్నావళి మొదలైంది. ఆ తరువాత లెటర్ను డ్రాఫ్ట్ చేసింది ఎవరు? జరిగిన మహా మోసం మొత్తానికి బాధ్యత మీరొక్కరే ఎందుకు తీసుకున్నారు? మీ సోదరుడి పేరు ఎందుకు చెప్పారు? అన్న ప్రశ్నలు కూడా ఇందులో ఉన్నాయి.
మొదటిసారి బ్యాలెన్స్ షీట్లో అంకెలు ఎప్పుడు తారుమారు చేశారు? ఆ పని చేయమని చెప్పింది ఎవరు? ఇక, సంస్థను బతికించేందుకు 1230కోట్ల రూపాయలు తెచ్చి పెట్టానని పేర్కొన్నారు కదా!...ఎలా తెచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఏయే ఖాతాల్లో నుంచి డబ్బును డ్రా చేశారు? ఎన్నిసార్లు అలా చేశారు? అన్నది వివరించగలరా? ఏ ఖాతా నుంచి ఈ సామాజిక ప్రయోజనాలకు డబ్బు మళ్లించారు?
250కి పైగా మీకు బినామీ కంపెనీలున్న మాట వాస్తవమేనా? ఎన్ని ఎకరాల భూములు కలిగి ఉన్నారు? వాటిని ఎలా కొన్నారు? ఆకుల రాజయ్య ఎవరు? అతని ద్వారా భూములు కొన్నది వాస్తవమేనా? విశాఖపట్టణంలో మీకెన్ని భూములున్నాయి...విదేశాల్లో ఎన్ని స్థలాలు ఉన్నాయి? వీటిపై ఆయన నుంచి సమాధానం రాబట్టే యత్నాలు సాగుతున్నాయి.
ఇన్ సైడర్ ట్రేడింగ్, దొంగ శాలరీ అకౌంట్లు, నిధుల మళ్ళింపు ద్వారా వచ్చిన వేలాది కోట్ల రూపాయలను రామలింగరాజు "భూ" మార్గం పట్టించినట్టు సి ఐడి ప్రాధమిక సాక్ష్యాధారాలను సేకరించింది. రంగారెడ్డి జిల్లాలో ఆయన వేలాది ఎకరాల భూములను వివిధ బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆ భూముల విలువ ఇప్పుడు ఇరవై వేల కోట్లకు పైగా ఉంటుందని కొన్ని వర్గాల కథనం.
ఇన్ని వేల కోట్ల ఆస్తులున్నా రామలింగరాజు జైళ్ళలో ఎందుకు చిప్పకూడు తింటున్నట్టు? దొంగలు కప్పుకున్న గొంగళితో నేల పడక ఎందుకు వేస్తున్నట్టు? ముందస్తు బెయిల్ కు ఆయన ఆనాడే ఎందుకు ప్రయత్నించలేదు? ఆయనను ఏ రాజకీయ పార్టీలు ప్రోత్సహించాయి? ఆయన ఎవరెవరికి ఎన్ని లంచాలు ఇచ్చారు? ఇవన్నీ రాజు గారికి బాగా మండిపోయి, ఎందుకీ జీవితం అనుకున్న తర్వాత బయటపడక మానవు.