'సత్యం'కు అండగా ఉన్న మంత్రి?
అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... 'సత్యం వ్యవహారంలో' సాయం చేస్తానంటూ కేంద్రమంత్రి ఒకరు రామలింగరాజు కుటుంబానికి 'ఆఫర్లు' పంపుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా తనకు 'అత్యంత భారీ మొత్తం'లో సొమ్ము ముట్టజెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సదరు కేంద్రమంత్రి గత నాలుగైదు రోజులుగా రామలింగరాజు కుటుంబ సభ్యులకు సంకేతాలు పంపుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
'తాను అడిగినంత' సొమ్ము అందజేస్తే... రామలింగరాజు కుటుంబానికి చెందిన మేటాస్ ఇన్ఫ్రా, మేటాస్ ప్రాపర్టీస్లపై తక్షణ చర్యలు లేకుండా చూసుకుంటానని కేంద్ర మంత్రి చెబుతున్నట్టు తెలిసింది. వాటి ఆస్తుల స్వాధీనం వంటి తదుపరి చర్యలను జాప్యం చేసేందుకు సహకరిస్తానని ఆయన పేర్కొంటున్నట్టు సమాచారం. సత్యం కుప్పకూలడం, రామలింగరాజు అరెస్టులతో అసలే అయోమయంలో మిగతా 2వ పేజీలో..పడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి అడిగిన 'ఫిగర్' విని ఠారెత్తినట్టు తెలిసింది.
"ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే... అన్నట్టుగా ఉంది ఆ మంత్రి వ్యవహారం. సత్యం, మేటాస్ కంపెనీల వ్యవహారాలు, వ్యాపార సంగతులన్నీ రామలింగరాజుకు మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఎదురైన పరిస్థితిని ఎదుర్కొనే శక్తియుక్తులుగానీ, నైపుణ్యంగానీ ఆయన కుటుంబానికి, కుమారులకు లేవు. అసలే గందరగోళంలో పడ్డవారి నుంచి భారీమొత్తం దండుకోవడానికి కేంద్ర మంత్రి ప్రయత్నించడం మన వ్యవస్థ దౌర్భాగ్యానికి నిదర్శనం'' అని ఈ వ్యవహారాన్ని సన్నిహితంగా పరిశీలిస్తున్న వ్యక్తి ఒకరు వ్యాఖ్యానించారు.
సత్యం కేసుల్ని ప్రస్తుతం రాష్ట్ర సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తున్నప్పటికీ, ఆర్థిక నేరాలు కావడంతో అవి ఏదో ఒకరోజు కేంద్ర సంస్థల పరిధిలోకి వెళ్లక తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సదరు కేంద్రమంత్రి బేరాలకు దిగి ఉంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రామలింగరాజు కుటుంబానికి భారీగా ఆస్తులున్నట్టు వార్తలు వస్తుండడంతో, ఎన్నికల తరుణంలో తన వాటా దక్కించుకోవడానికి కేంద్ర మంత్రి ఎత్తువేసి ఉంటారని అవి అభిప్రాయపడ్డాయి.