కోమటిరెడ్డికి ఆంధ్రజ్యోతి టెర్రర్
ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి. అందుకే ఆయన పైన ఉన్న వ్యక్తులను కిందికి తెస్తున్నారన్న విషయం ప్రచారంలో ఉంది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేయలేదని కొండను తవ్వి ఎల్లుకను పట్టినట్టు ఈ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాగానే, కోమటి రెడ్డి బీటెక్ అనే శీర్షిక పెట్టింది. చాలా మంచిది. అక్షరాలు సరిగ్గా రాని వారు మంత్రులుగా ఉండగా లేనిది, ఇంజినీరింగ్ లో కొన్ని పేపర్లు మాత్రమే పూర్తి చేయని కోమటిరెడ్డి మీద ఇంత దాడి అవసరమా? కోమటి రోశయ్య మీద పరోక్ష దాడి చేసిన తర్వాత కోమటిరెడ్డి మీద ప్రత్యక్ష దాడికి దిగితే తప్పేమిటనుకున్నారేమో.
కోమటిరెడ్డి మీద ఆంధ్రజ్యోతి చేసిన దాడి ఆంధ్రవాళ్ళు తెలంగాణ మీద చేసిన మరో దాడిగా ప్రచారంలోకి వచ్చింది. అయితే కోమటిరెడ్డి ఈ కథనంతో డెఫెన్స్ లో పడ్డారు. నీళ్ళు నమిలారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆంధ్రావాలా అయినా ఆయన తలిదండ్రులు నిజామాబాద్ లో సెటిల్ అయ్యారు. తెలంగాణ రాష్టం ఏర్పడాలని కోరుకునే ఆంధ్రుల్లో ఆయన ప్రధముడు. కిరసనాయిల్ ను ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేసుకుని ఆ డబ్బుతో చదువుకున్నానని రాధాకృష్ణ తన ఆత్మకథగా తన పత్రికలో రాసుకున్నారు. ఆ కథనం ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచింది. వ్యక్తిత్వవికాస సాహిత్యాన్ని మరో మలుపు తిప్పింది. అంతటి మహనీయుడిని మన కాలంలో మనం చూడగలడం నిజంగా మన అదృష్టం. ఆయన హయాంలోని ఆ పత్రిక నుంచి, ఆ చానల్ నుంచి మరిన్ని మంచి వార్తా కథనాలను ఆశిద్దాం.