బాబు పుత్రుడు లోకేష్ పై వార్
మరో సమయంలోనైతే ఎంత మంది ఉద్యోగులను తొలగించినా పెద్దగా అల్లరి ఉండేది కాదు. ఇప్పటికీ ఆంధ్రప్రభ వంటి మీడియా సంస్థలు ఒక్కొక్కరిని ఏరి గుట్టు చప్పుడు కాకుండా వెనక్కి పంపించే సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ఒకేసారి అంత మందికి ఉద్వాసన పలకడంతో ఒక్కసారిగా మంట పుట్టింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న సాక్షి టీవీ చానెల్, దినపత్రిక ఉద్యోగుల ఉద్వాసనపై చంద్రబాబును దుమ్మెత్తి పోస్తున్నాయి. సాక్షి టీవీ చానెల్లో ఆ వార్తాకథనం గురువారం ఎడ తెరిపి లేకుండా ప్రసారమైంది. మరోవైపు తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ ఆ వార్తాకథనానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రసారం చేస్తోంది. తెలంగాణకు చెందినవారు కాబట్టే తొలగించారంటూ దుమ్మెత్తి పోస్తోంది. తెలంగాణ జర్నలిస్టుల సంఘం ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు అండగా నిలిచింది.
హైదరాబాదులోని మణికొండలో గల స్టూడియో - ఎన్ కార్యాలయం ముందు ఉద్వాసనకు గురైన ఉద్యోగులు ధర్నాకు దిగారు. తిరిగి తీసుకునే వరకు ఆందోళన సాగిస్తామని అంటున్నారు. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కూడా వారికి మద్దతు ప్రకటించింది. సాక్షి, రాజ్ న్యూస్ తప్ప మిగతా మీడియా సంస్థలు ఉద్వాసనకు గురైన ఉద్యోగుల ఊసు ఎత్తడం లేదు. అవన్నీ ఏదో మేరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడం, లేదా ఆ పార్టీతో పెట్టుకోవడం ఎందుకు అనే పద్ధతిలో వ్యవహరించడం వల్ల ఆ ఊసు ఎత్తడం లేదు. ఈ మీడియా వార్ స్టూడియో ఎన్ పుణ్యమా అని కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. లోకేష్ చర్య వల్ల చంద్రబాబు ఇరకాటంలో పడాల్సి వచ్చింది.