రామలింగరాజు జైలు జీవితం ఏడాది దాటింది...
సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు జైలు పాలై ఈనెల పదో తేదీకి సరిగ్గా ఏడాది. ఉంటే జైలు, లేదంటే నిమ్స్ ఆస్పత్రి. ఇది ఆయన ప్రస్తుత దినచర్య. తమ్ముడు రామరాజు మాత్రమే జైల్లో ఆయనకు తోడు. ఒకప్పుడు పేరున్న సంస్థల అధినేతలతో కాలం గడిపిన ఆయనకు ప్రస్తుతం జైల్లో పరిచయమైన ఖైదీలే స్నేహితులయ్యారు. జైలుకు వచ్చిన కొత్తలో ఆయన ఒక రౌడీ షీటర్ తో దుప్పటి పంచుకుని పడుకోవలసి వచ్చింది. అపురూపంగా పెంచి పెద్ద చేసిన సత్యం కంప్యూటర్స్ చేతుల్లో నుంచి జారిపోయిందన్న బాధో, ఏమో గాని ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ప్రస్తుతం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు.
సత్యం కంప్యూటర్స్లో వెలుగు చూసిన కుంభకోణం విచారణ ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. ట్రంకు పెట్టెల కొద్ది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు రామలింగరాజు లేని 7500కోట్ల రూపాయల ఆదాయాన్ని ఉన్నట్టు చూపించటం వెనక ఉన్న అసలు కారణాన్ని ఇంకా నిర్ధారించలేకపోయారు. సత్యం కంప్యూటర్స్ ఉచ్ఛ దశలో ఉన్నపుడు మైటాస్ను ప్రారంభించి దానిని కుమారులకు అప్పగించిన రామలింగరాజు రియల్ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. అక్కడే ఆయన పతనం మొదలైంది.
ఆయన బినామీ పేర్లతో కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల ధరలు ఇప్పుడు బూమ్ బద్దలు కావడంతో నేల చూపులు చూస్తున్నాయి. కొడుకు తేజరాజు వ్యాపారాలు కూడా అంత గొప్పగా లేవు. రామలింగరాజు సీరియస్ గా బెయిల్ ప్రయత్నాలు చేయడం లేదని, ఆయన బెయిల్ మీద బయటికి వస్తే అమెరికన్ ఫెడరల్ కోర్టుల తరఫున అమెరికన్ పోలీసులు వచ్చి ఆయన అమెరికా తీసుకెళ్ళే అవకాశముందని, అక్కడి కోర్టులో ఆయనకు కొన్ని దశాబ్దాల శిక్షలు పడుతాయని ఇక్కడి కొందరు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.