రోశయ్య మంత్రివర్గ విస్తరణకు ఆటంకాలు
ఆ తరువాతే అంటే ఏప్రిల్ రెండవ, లేదా మూడవ వారంలో ముఖ్యమంత్రి రోశయ్య తన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సిఎం సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే అప్పటి వరకు రాష్ట్రంలో ప్రాంతీయ వాదం ఉద్రిక్తతలు సద్దుమణిగి ప్రశాంత వాతావరణం నెలకొంటేనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, లేకుంటే మరింత ఆలస్యమవుతుందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలకు ముందు మంత్రివర్గాన్ని విస్తరిం చడం ద్వారా కొత్త సభ్యులను చేర్చు కోవడం, పాత సభ్యుల శాఖలు మార్పు వంటి పరిస్థితుల వల్ల బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలుంటాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఈ సమావేశాల తరువాతే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సిఎం నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
గత ఏడాది మేలో ఎన్నికల అనంతరం ఏర్పాటైన మంత్రి వర్గమే ఇప్పటికి కొనసాగుతున్నది. ఎన్నికల తరువాత కాంగ్రెస్ మళ్ళీ మెజారిటీ సాధించడంతో ముఖ్యమంత్రిగా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి అప్పట్లో రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నియమించుకున్న మంత్రి వర్గమే ఇప్పటికి కొనసాగుతున్నది. మంత్రుల పనితీరు ఆధారంగా ఉద్వాసనలు ఉంటాయని, నవంబర్లో మంత్రి వర్గాన్ని విస్తరిస్తామని ఆ ఏడాది సెప్టెంబర్ నెలలోనే వైఎస్ ప్రకటించారు. అయితే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజునే వైఎస్ చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.