హైకమాండ్ ఆంతర్యం జైపాల్ రెడ్డికి తెలిసిపోయిందా?
ప్రత్యేక వాదానికి మొదటి నుంచి పెద్దన్నగా ఉన్న ఆయన ఇటీవలికాలంలో మౌనదీక్ష వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లాబీయింగ్కు నైతిక మద్దతునివ్వడం మొదలు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే విషయంలో చకచకా పావులు కదిపిన ఈ తెలంగాణ వాది ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరి రాజకీయ జేఏసీ నేతలకు మింగుడు పడడంలేదు. జైపాల్రెడ్డి కనిపించడంలేదంటూ జిల్లాలో పలు పోలీస్స్టేషన్లలో జేఏసీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నా ఏబీవీపీ రణభేరి, ఉద్యోగ వర్గాల జేఏసీ సైతం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా ఆయన మౌనం వీడకపోవడం ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
నాలుగు దశాబ్దాల క్రితం ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జైపాల్ ఇప్పుడు ఆస్థాయిలో చొరవ చూపడం లేదన్నది ఆయన వ్యతిరేకుల ఆరోపణ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అన్నీ తానై కాంగ్రెస్ రథసారథిగా ఉంటారని భావించగా...ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుందన్నది వారి భావన. త్వరలో కేంద్రం వెలువరించనున్న ప్రకటన తెలంగాణ వాదులను సంతోషపరుస్తుందా..? సంది గ్ధంలో పడవేస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ విషయంలో కేంద్రమంత్రిగా, సీనియర్ నేతగా, తెలంగాణ వాదిగా జైపాల్ ఏంచేస్తారన్న అంశంపైనే అందరూ దృష్టి కేంద్రీకరించారు. కీలక దశలో ఉన్న ఉద్యమానికి ఆయన తనవంతుగా రాజీనామా చేసి బయటికి వ స్తారా? మంత్రివర్గంలోనే ఉంటూ తెలంగాణపై మరింత ఒత్తిడి చేస్తారో అంతు చిక్కడంలేదు.
తెలంగాణ అంశం రాజకీయపార్టీలను ఆత్మరక్షణలో పడేసింది. జిల్లా నేతలంతా 'ప్రత్యేక'స్వరం వినిపిస్తుండగా ఆయనమాత్రం 'కూల్'గా హస్తినలో తన కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారు. కేంద్ర సర్కారు ప్రత్యేక రాష్ట్రంపై డిసెంబర్ 23న చేసిన రెండో ప్రకటన తెలంగాణలో రాజకీయ కల్లోలం సృష్టించింది. ప్రకటన మలిరోజు హడావుడిగా ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైపాల్రెడ్డితోనే లాబీయింగ్ నెరపాలని భావించారు. అందుకనుగుణంగా ఆయన ఇంట్లోనే సంప్రదింపులు జరిపారు. ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
తాను రాజీనామా చేయాలన్న రాష్ట్ర మంత్రుల సూచనను సున్నితంగా తిరస్కరించిన జైపాల్ తెలంగాణ అంశంపై నోరుమెదపడంలేదు. ఇటీవల రాష్ట్ర రాజధానిలో నాలుగైదు రోజులు గడిపిన అమాత్యుడు ఈ విషయంపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఆయన వైఖరి అర్థంకాక కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. నొప్పించక..తానొవ్వక అనే తరహాలో కాంగ్రెస్ హైకమాండ్ను ఇబ్బందుల్లోకి నెట్టకుండా కొన్నాళ్లు మౌనం దాల్చడమే మేలని ఆయన భావిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.