సొంత కుంపటికి జగన్ రెడీ?

ఇప్పటి వరకు జగన్ ముఖ్యమంత్రి కె. రోశయ్యను, వి హనుమంతరావు వంటి కొంత మంది నాయకులను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన వైయస్ జగన్ మీడియా ఇప్పుడు సోనియాపై తీవ్రమైన దాడికి పూనుకుంది. యుపిఎ ప్రభుత్వం కుంభకోణాల మయంగా మారిందనే అనడమే కాకుండా రాయబరేలీకి సోనియా వెళ్లడం లేదంటూ దుమ్మెత్తిపోసింది. ఈ విమర్శలను కాంగ్రెసు నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఒకరకంగా పార్టీలోని వైయస్ జగన్ ప్రత్యర్థులకు కలిసి వచ్చింది. అయితే, జగన్ కోరుకుంటోంది కూడా అదేనా అనే అనుమానం కలుగుతోంది. పార్టీ అధిష్టానాన్ని, సోనియాను రెచ్చగొట్టడం ద్వారా తనపై చర్యలు తీసుకునేలా ఉసిగొల్పాలనేది కూడా ఆయన ఉద్దేశం కావచ్చు. అధిష్టానం చర్యలు తీసుకోగానే బయట పడి సొంత పార్టీని పెట్టుకోవచ్చునని కూడా ఆయన అనుకుంటూ ఉండవచ్చు.
ఏమైనా, పార్టీ అధిష్టానానికి, వైయస్ జగన్ కు మధ్య ఇంత వరకు సాగుతున్న దాగుడుమూతల వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే వైయస్ జగన్ పై అధిష్టానం చర్యలు తీసుకోవడమో, జగన్ తనంత తానుగా బయటకు రావడమో జరగవచ్చునని అనుకుంటున్నారు. ఈ నెలాఖరులోగానే ఆ పని జరిగి పోతుందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications