అమెరికా: స్వర్ణ యుగం నుండి సంక్షోభం వైపు..

ఇటు ఉత్పత్తి, అటు వినిమయం సమానంగా ఉండేవి. ఉద్యోగావకాశాలు మెండుగా ఉండేవి. ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత లాభం చేకూరేది. ఆ తర్వాతే అమెరికా ఆర్థికం గతి తప్పడం మొదలుపెట్టింది. 1980లలో అమెరికాలోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి షేర్ల రూపంలో డబ్బులు వసూలు చేయటం మొదలుపెట్టాయి. ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది. దీని వల్ల పదేళ్లలో అనేక కంపెనీలు దివాలా తీశాయి. ఆ తర్వాత 1990ల నాటికి మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ కొన్ని కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిపోయింది. 2001లో టెక్నాలజీ కంపెనీలు దివాలా తీసి బూమ్ బద్దలవడంతో, పెట్టుబడిదారులు దాదాపు ఐదు లక్షల కోట్ల డాలర్లు నష్టపోయారు.
పెట్టుబడి బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు రేటింగ్ సంస్థలు కీలకపాత్ర పోషించసాగాయి. ఎడాపెడా గృహ రుణాలిచ్చాయి. రుణాలు వసూలు కాక, అప్పులిచ్చిన సంస్థలు కూలిపోయాయి. ఇన్ని సంక్షోభాలు వచ్చినా అమెరికా ప్రజలు ఎలా తట్టుకుని నిలబడ్డారన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ఒక విశ్లేషణ ప్రకారం 1980ల తర్వాత అమెరికాలో ఉద్యోగాలలో మహిళల శాతం చాలా పెరిగింది. పురుషులలో నిరుద్యోగం పెరిగినా మహిళల ఉద్యోగాలతో ఆయా కుటుంబాలు తట్టుకున్నాయి. పరిస్థితికి అనుగుణంగా ఓవర్టైమ్ చేయడం మొదలుపెట్టారు. సగటు అమెరికన్ ఏడాదిలో 2200 గంటలు పనిచేస్తాడని తేలింది. జపాన్ వాళ్లకంటే ఈ పని గంటలు ఎక్కువ కావడం గమనార్హం. అమెరికా నెత్తిన ఉన్న అప్పు ఇప్పటికే ఆ దేశ జీడీపీలో 70 శాతానికి చేరినట్టు అంచనా. ఇలా అప్పులు చేస్తూ పోతే ఎక్కడ తేలుతామన్నది కొందరి వాదన. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ అంశాన్ని కొంత రాజకీయంగా కూడా ఉపయోగిస్తున్నారు.
ప్రతినిధుల సభలో రిపబ్లికన్స్ ఎక్కువగా ఉన్నారు. పన్నులు పెంచకుండా వ్యయాన్ని తగ్గించుకోవాలన్నది వారి డిమాండ్. ఒబామా సారథ్యంలోని డెమోక్రాట్స్ మాత్రం ముందుగా రుణ సమీకరణ పరిమితిని పెంచాలని, ఆ తర్వాత లోటు తగ్గింపునకు, రెవెన్యూ పెంపునకు చర్యలు చేపడతామని అంటున్నారు. రుణ పరిమితితోపాటు అమెరికా వ్యయాన్ని కూడా పెంచాలని లిబరల్ ఎకనామిస్టులు అంటున్నారు. అప్పుడే ఆర్థిక రంగం మళ్లీ పట్టాలపైకి ఎక్కుతుందని చెబుతున్నారు. అంటే ఎడాపెడా అప్పులు చేసి, అదే స్థాయిలో ఖర్చు కూడా చేయాలి. మరోవైపు రిపబ్లికన్లు, టీ పార్టీ ఉద్యమకారులు రుణ పరిమితిని పెంచకుండా ఖర్చులు తగ్గించకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రత్యేక హక్కులను ఉపయోగించి అమెరికా ట్రెజరీ శాఖ ఒక్కోటి లక్ష కోట్ల డాలర్ల విలువైన ప్లాటినమ్ కాయిన్స్ రెండు విడుదల చేస్తే సరిపోతుందని కొందరి సూచన. ఫెడరల్ రిజర్వ్లో వీటిని డిపాజిట్ చేసి ఆ మేరకు నిధులను సర్కారు వాడుకోవచ్చని వారి అభిప్రాయం.












Click it and Unblock the Notifications