రేణుకా చౌదరి దూకుడు వెనక..
శస్త్రచికిత్స నిమిత్రం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అమెరికా వెళ్లిన సందర్భంలో ఆమె ఎఐసిసి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. సోనియా తనయుడు, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చలువ వల్లనే ఆమెకు ఆ పదవి దక్కిందనేది పార్టీ వర్గాలు చెప్పే మాట. దాన్ని ఎలా చేజిక్కించుకున్నా, దాన్ని వాడాల్సిన పద్ధతిలో వాడలేదనే మాట ఓ వైపు వినిపిస్తుండగా, ఆమె ప్రకటన వెనక కూడా రాహుల్ గాంధీ ఉన్నారనే మాట వినిపిస్తోంది. రాష్ట్రానికి చెందిన నాయకురాలి చేత తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేయించడం ద్వారా రాహుల్ గాంధీ తన తెలంగాణ వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకున్నారని చెబుతున్నారు.
రేణుకా చౌదరి నిజానికి, అందరు సీమాంధ్ర నాయకుల మాదిరిగానే తన తెలంగాణ వైఖరిని ప్రదర్శించడానికి వచ్చిన అవకాశాలన్ని వినియోగించుకున్నారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చిన పద్ధతిలో ఆమె వ్యవహరించారు. దాంతో రేణుకా చౌదరిపై తెలంగాణ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఆమెపై పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఆమెపై తెలంగాణ నాయకులు కటువుగానే మాట్లాడారు.
నిజానికి, ఖమ్మం జిల్లాలో ఆమె తెలంగాణవాదుల చేతిలో పలుమార్లు చేదు అనుభవాన్ని ఎదుర్కున్నారు. అలా ఎదుర్కున్న ప్రతిసారీ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ వచ్చారు. కానీ, ఢిల్లీ పీఠం మీద కూర్చుని తన తెలంగాణ వ్యతిరేక వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారనే మాట వినిపిస్తోంది. తెలంగాణలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఇక్కడే ఎదిగిన ఆమె తెలంగాణ సమాజంలో కలిసిపోలేదని, అందువల్లనే ఆ తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారని అంటున్నారు.