చిరుకు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో!

Chiranjeevi
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మ్యాజిక్‌కు అనుగుణంగా అంతా సాఫీగా సాగడంతో అధిష్టానం ఇక పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. శాసనసభా వేదికపై ఎన్నిక ఘట్టం ముగిసింది. ఇకపై పార్టీ బలోపేతమే లక్ష్యంగా వడివడిగా సాగేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను మంత్రివర్గంలో మార్పులకు అతి త్వరలో తెర తీస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో విలీనమవుతున్న ప్రజారాజ్యం నేతలకు రెండు చోట్లా స్థానం కల్పించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి కేంద్ర కేబినెట్‌లో స్థానం కల్పించాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు నేతలకు రాష్ట్ర మంత్రివర్గంలో పదవులు కట్టబెడతారు.

రాష్ట్రంలో కార్పొరేషన్, పార్టీ పదవుల్లో కూడా ప్రజారాజ్యం పార్టీకి చెందిన వారికి స్థానం కల్పిస్తామని అధిష్ఠానం ఇదివరకే హామీ ఇచ్చింది. పదవుల పందేరంపై చర్చించడం కోసం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్, చిరంజీవిని శనివారం రాత్రే ఢిల్లీకి పిలిపించారు. చిరంజీవికి, పీఆర్పీ నేత ఘంటా శ్రీనివాసరావుకు ఆయన విందు ఇచ్చారు. రాష్ట్రంలో భవిష్యత్తులో కీలక పరిణామాలు సంభవించనున్నాయని, అందులో చిరంజీవి బృహత్తర పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆజాద్ ఆయనకు చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును విస్తరించే క్రమంలో వెనుకబడిన, దళిత వర్గాలను పార్టీకి అనుకూలంగా మార్చేందుకు చర్యలు చేపడతామని, ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవల్ని ఉపయోగించుకుంటామని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం.

రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జూన్ మూడవ వారంలో లేదా చివరి వారంలో జరుగుతుందన్నది పార్టీ వర్గాల మాట. జూలై రెండో వారంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని, అందువల్ల జూన్‌లోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇతరత్రా అవాంతరాలేమీ లేకపోతే జూన్ 13, 14 తేదీల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపవచ్చునని, లేకపోతే జూన్ చివరికి వాయిదా పడవచ్చునని పార్టీ వర్గాలు వివరించాయి. ఈలోపు చిరంజీవికి రాజ్యసభ సీటు విషయంపై అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. విలీనం విషయంపై ఇరు పార్టీల నుంచి ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు అన్ని పత్రాలూ చేరాయి. అయితే ఎన్నికల కమిషన్ అధికారులు ఇతరత్రా వ్యవహారాల్లో తలమునకలై ఉండడం, ఎన్నికల కమిషనర్లు విదేశీ పర్యటనలో ఉండడం వల్ల విలీన తతంగం పూర్తయ్యేందుకు మరికొద్ది రోజుల సమయం పట్టవచ్చునని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విలీనానికి ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేయగానే రాష్ట్రంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతాయని తెలిపాయి. ప్రజారాజ్య విలీన కార్యక్రమం పూర్తి, చిరంజీవికి, ఇతర నేతలకు పదవులు కట్టబెట్టడంతోపాటు, పీసీసీ అధ్యక్షుడిని ఖరారు చేయడం, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయంగా రాజకీయ కమిటీని నియమించడం వంటి కార్యక్రమాలనూ అధిష్ఠానం సత్వరం పూర్తి చేయనుంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలోను, ఇతర పదవుల భర్తీలోను పార్టీకి చెందిన వివిధ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడంపై అది ఇప్పటికే పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆజాద్‌ను తాజాగా ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా జూన్‌లో ఆజాద్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళతారని, అందువల్ల ఆయన అనుకూలతను బట్టి కొన్ని నిర్ణయాల తేదీలు అటు ఇటు మారే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+