చిరు సరే, జగన్పై చంద్రబాబు ఆశలు
వైయస్ జగన్ కూడా ఏదో ఒక రోజు కాంగ్రెసు పార్టీలో కలిసి పోతారని ఆయన నమ్ముతున్నారు. పరిణామాలు ఆ దిశలోనే సాగుతున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. తెరాస కూడా అదే బాట పట్టవచ్చునని ఆయన అనుకుంటున్నారు. దీంతో కాంగ్రెసుకు తమ పార్టీ తప్ప మరో పార్టీ పోటీ ఉండదని ఆయన చెబుతున్నారట. ఆ దిశగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కూడా ఆయన పార్టీ నాయకులకు సూచించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం వల్ల, జయప్రకాష్ నారాయణ లోకసత్తా వల్ల తాము సీట్లు కోల్పోయామని చంద్రబాబు ఓ విశ్లేషణ చేశారు. లోకసత్తా మళ్లీ ప్రాణం పోసుకోవడం కష్టమేనని ఆయన భావిస్తున్నారు.
చిరంజీవి చేరిక వల్ల కాంగ్రెసులో ముఠా తగాదాలు పెరుగుతాయని కూడా చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా తగాదాలు తమ పార్టీకి లాభిస్తాయని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో చిరంజీవి రాక వల్ల ప్రాబల్యం తగ్గే కాంగ్రెసు నేతలు, కాంగ్రెసులో చేరిక వల్ల ప్రాధాన్యం లభించని ప్రస్తుత ప్రజారాజ్యం నేతలు తమ పార్టీనే ప్రత్యామ్నాయంగా చూస్తారని ఆయన విశ్లేషణ చెస్తున్నారట. ఇప్పటికే చిరంజీవి కాంగ్రెసులో కలవడంపై తెలుగుదేశం నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు.
అయితే, జగన్ తిరిగి కాంగ్రెసులోకి వస్తారని కచ్చితంగా చెప్పలేని స్థితే ఉంది. చిరంజీవిని చేర్చుకోవడం వల్ల కాంగ్రెసు అధిష్టానంపై జగన్ మరింతగా మండిపడుతున్నారు. తనను అణచివేయడానికే, తనకు చెక్ పెట్టడానికే చిరంజీవిని కాంగ్రెసు అధిష్టానం చేరదీసిందని ఆయన భావిస్తున్నారు. ఇక, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప తెరాస అధినేత కెసిఆర్ కాంగ్రెసుతో దోస్తీ కట్టరు. ఎప్పటిలాగే, వచ్చే ఎన్నికల్లోనూ త్రిముఖ పోటీ తప్పేట్లు లేదు. అయితే, జగన్ ఎక్కువగా కాంగ్రెసు ఓట్లను చీలుస్తుందని కూడా చంద్రబాబు నమ్ముతున్నారు. చంద్రబాబు ఆశలు ఫలిచండం అంత సులభమేమీ కాదు.