దాసరికి మొండిచేయి, చిరంజీవికి సీటు
చిరంజీవిని దాసరి నారాయణరావు స్థానంలో రాజ్యసభకు ఎన్నిక చేయించి, కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం ఒకటి ఈ మధ్య జరుగుతోంది. రాష్ట్రం నుంచి వచ్చే ఏడాది రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. కె. కేశవరావు, దాసరి నారాయణ రావు పదవీకాలం ముగుస్తోంది. అయితే, వీరిద్దరికి కూడా మళ్లీ టికెట్లు లభించకపోవచ్చునని అంటున్నారు. కేశవ రావు స్థానంలో పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ను, దాసరి నారాయణరావు స్థానంలో చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేయవచ్చునని అంటున్నారు. వారిద్దరి స్థానంలో వీరిద్దరిని ఎంపిక చేయడం వల్ల సామాజిక వర్గంలో కూడా మార్పు ఉండదు. అందువల్ల ఎంపిక విషయంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం లేదు.
దాసరి నారాయణరావు కాంగ్రెసు పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి మాత్రం వచ్చే ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలనే ఆశతో ఉన్నారు. ఈలోగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై కేంద్ర మంత్రి పదవిని కూడా ఆయన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.