సోనియాకు జగన్, కెసిఆర్ భయం
తెలంగాణ రాష్ట్రం ఇస్తే, క్రెడిట్ మొత్తం కెసిఆర్కే వెళ్తుందనే అభిప్రాయంతో సోనియా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి, పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎన్నికలు వస్తే దాని వల్ల తెరాస కాంగ్రెసు పార్టీని పూర్తిగా దెబ్బ తీస్తుందనే భయం కాంగ్రెసు అధిష్టానంలో ఉంది. అయితే, కాంగ్రెసు బలం తెలంగాణలో పూర్తిగా తగ్గిపోతుందని చెప్పడానికి కూడా లేదు. ఎన్నికలు వచ్చేనాటికి కాంగ్రెసు దీటైన సమాధానం ఇచ్చే స్థితిలో ఉంటుందనడానికి తగిన వాతావరణం ఉంది. కాంగ్రెసుకు తెలంగాణ బలమైన నాయకులే కాకుండా ప్రజల మద్దతు కూడా ఉంది. తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెసుపై వ్యతిరేకత మరింతగా పెరిగే ప్రమాదం ఉంది.
రాష్ట్రాన్ని విభజిస్తే తమ పార్టీ సీమాంధ్రలో తుడిచిపెట్టుకు పోతుందనే అభిప్రాయం కాంగ్రెసు అధిష్టానంలో ఉంది. ఇప్పటికే సీమాంధ్రలో వైయస్ జగన్ కాంగ్రెసుకు, తెలుగుదేశం పార్టీలకు సవాల్ విసురుతున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే, వైయస్ జగన్ దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్తారని, దానివల్ల సీమాంధ్రలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్తుందని భావిస్తున్నారు. దీనికితోడు జగన్ విషయంలో మరో భయం కూడా కాంగ్రెసు అధిష్టానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలా మంది కాంగ్రెసు నాయకులు వైయస్సార్ పార్టీలోకి వెళ్లే ప్రమాదం ఉందని కూడా భయపడుతుంది. అయితే, వైయస్ జగన్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తే, తెలంగాణలో ఆయనకు ఆదరణ ఉండదు. అందువల్ల ఈ విషయంలో సోనియా గాంధీ అనవసరమైన అపోహలకు గురవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.