గాలి మైనింగ్: ఇటు జగన్, అటు యడ్డీ
యడ్యూరప్ప కుమారులు బివై రాఘవేంద్ర, బివై విజయేంద్ర, అల్లు ఆర్ఎన్ సోహన్ కుమార్లకు 20 కోట్ల రూపాయలు, యడ్యూరప్ప కుటుంబం నడుపుతున్న ప్రేరణ ఎడ్యుకేషన్ సొసైటీకి పది కోట్ల రూపాయలు ముట్టినట్లు లోకాయుక్త తప్పు పట్టింది. యడ్యూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడానికి ఒకానొక సందర్భంలో గాలి జనార్దన్ రెడ్డి తిరుగుబాటు ప్రకటించారు. యడ్యూరప్పకు వ్యతిరేకంగా శాసనసభ్యుల శిబిరాలు నిర్వహించారు. ఎట్టకేలకు యడ్యూరప్ప దిగి రాక తప్పలేదు. అప్పటి నుంచి యడ్యూరప్పకు గాలి జనార్దన్ రెడ్డి పూర్తి మద్దతు ఇస్తున్నారు. దీన్ని బట్టి యడ్యూరప్పను గాలి సోదరులు పూర్తిగా లోబరుచుకున్నారని అర్థమవుతోంది. అదే యడ్యూరప్ప కొంప ముంచినట్లు భావించవచ్చు.
కాగా, ఇటు అంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఇతోధికంగా లాభం పొందారు. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ సంస్థ ఏర్పాటుకు అనుమతి పొందారు. దానికి కాప్టివ్ మైనింగ్ కింద ఓబుళాపురం గనులను వైయస్ రాజశేఖర రెడ్డి అప్పగించారు. బ్రాహ్మణి స్టీల్ నిర్మాణం జరిగే వరకు ఖనిజాలను అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. దీంతో ఖనిజాలను ఎగుమతి చేసి గాలి జనార్దన్ రెడ్డి పెద్ద యెత్తున సంపదను కూడబెట్టారు. ఇందులో వైయస్సార్ కుమారుడు, ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇతోధికంగా లాభపడ్డారని అంటున్నారు. ఆ డబ్బుతోనే వైయస్ జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్గా నిలిచాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బ్రాహ్మణి స్టీల్స్ రాలేదు గానీ గాలి జనార్దన్ రెడ్డికి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ బంగారు బాతు గుడ్లు పెట్టిందని చెబుతారు.
గాలి జనార్దన్ రెడ్డి అండదండలతోనే యడ్యూరప్ప ప్రస్తుతం బిజెపి అధిష్టానంపై తిరుగుబాటుకు పూనుకున్నట్లు చెబుతున్నారు. ఆయన అండదండలతోనే ఇటు వైయస్ జగన్ కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరించి, ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేశారని, అది సాగకపోవపడంతో సొంత పార్టీ పెట్టి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటారు.