శ్రీకృష్ణ నివేదిక: హైదరాబాదే కీలకం
సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన, రెండు రాష్ట్రాలకు కొత్త రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్, కేంద్ర పాలిత ప్రాంతంలో రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని 1330 గ్రామాలు. నాలుగో ప్రత్యామ్నాయంగా దీన్ని కమిటీ చూపింది. స్పష్టంగా ఇది సీమాంధ్ర పెట్టుబడిదారులకు, రాజకీయ నాయకులకు నచ్చే విషయమని చెప్పవచ్చు. హైదరాబాదుతో పాటు ఈ జిల్లాల్లోని ఆ ప్రాంతాల్లో సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టారు. కాస్తోకూస్తో నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలు కూడా. సంస్థలను నెలకొల్పారు. శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణలో అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా చెప్పవచ్చు.
తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా విభజన. సరిహద్దులు సర్దుబాటు చేసి హైదరాబాద్ను తెలంగాణ రాజధానిగా చేయడం, సీమాంధ్రకు కొత్త రాజధాని. ఇది శ్రీకృష్ణ కమిటీ చూపిన ఐదో ప్రత్యామ్నాయం. ఇది మాత్రమే తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు కాస్తా అంగీకరయోగ్యమైన సిఫార్సుగా చెప్పవచ్చు. సరిహద్దులను సర్దుబాటు చేయడానికి ఆయా ప్రాంతాల ప్రజలు అంగీకరిస్తారా అనేది అనుమానం.
సమైక్యాంధ్రను కొనసాగించడం, వైద్య, విద్య, సాధారణ అభివృద్ధికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు తెలంగాణ ప్రయోజనాలకు ప్రత్యేక రాజ్యాంగ రక్షణ కల్పించడం. ఇది కూడా హైదరాబాదును సీమాంధ్ర పెట్టుబడుల గుప్పిట్లో ఉంచేదే కావడం విశేషం. ఇంతకు ముందు ఇచ్చిన రాజ్యాంగ గ్యారంటీలేవీ అమలుకు నోచుకోలేదు. ఇది సీమాంధ్రులకు చాలా ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయంగా ఉండవచ్చు. ఇప్పుడు కూడా రాజ్యాంగ పరిరక్షణలను మాయ చేసి బుట్ట దాఖలు చేయడానికి వీలవుతుందనేది సీమాంధ్ర పెట్టుబడిదారులకు అనుభవంతో తెలిసిన విషయం.