సమైక్యాంధ్ర లీడర్ చంద్రబాబేనా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేయగానే అందుకు వ్యతిరేకంగా కథను నడిపింది చంద్రబాబేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు పదే పదే ఎత్తి చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాల కథను చంద్రబాబే నడిపించారని అంటున్నారు. పార్టీలకు అతీతంగా సీమాంధ్ర రాజీనామాల లేఖలు చంద్రబాబు తయారు చేయించినవేనని కూడా విమర్శలున్నాయి. వీటన్నింటికీ సమాధానం చెప్పేవారు లేరు. కానీ చంద్రబాబు పూర్తి తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మాత్రం దండిగానే ఉన్నాయి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అనే పదాన్ని శానససభలో నిషేధించిన ఘనత కూడా ఆయనదే.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం లేదా కేంద్ర ప్రభుత్వం మార్చి మొదటివారంలో నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం బలం పుంజుకుంటోంది. దీంతో మరోసారి సీమాంధ్ర రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా జూలు విదిలిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కోసం సమాయత్తం కావడానికి కాంగ్రెసు సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఈ నెల 5వ తేదీన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమవుతున్నారు. తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ఈ నెల 3వ తేదీన సమావేశమవుతున్నారు. వేర్వేరుగా సమావేశమవుతున్నప్పటికీ కార్యాచరణ మాత్రం ఒక్కటిగానే ఉండవచ్చునని అంటున్నారు. ఇందులో భాగంగానే జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబును కలిశారని అంటున్నారు.