విభజనపై జైపాల్ రెడ్డి నిర్ణయమే కీలకం!
తాజా వైఖరితో తెలంగాణ సమస్య పరిష్కారంలో అధిష్ఠానానికి, కాంగ్రెస్ నేతలకూ మధ్య జైపాల్ అనుసంధాన కర్తగా మారారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్పటేల్ వంటి నేతలు ఆయన ఇంటికి వచ్చి మాట్లాడారు. ప్రణబ్ ముఖర్జీ, గులాంనబీ ఆజాద్ వంటి ప్రముఖులు జైపాల్తో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇటీవల ఈ చర్చలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆయనే అంగీకరించారు. ఏపీలోని ఇరు ప్రాంతాల నేతలూ ఢిల్లీలో జైపాల్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయన సలహాలు స్వీకరించడం ఎన్నాళ్లుగానో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర నేతల్ని ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో, పార్టీలో పెద్దల్ని మరో వైపు ప్రభావితం చేసి వారితో మాట్లాడగలిగిన, ఒక రాజకీయ ఫార్ములా దిశగా నడిపించగలిగిన రాజకీయ చతురత జైపాల్కే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
జైపాల్ పెద్దరికాన్ని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలతోపాటు కొన్ని ఇతర పార్టీల వారూ అంగీకరిస్తున్నారు. తెలంగాణ కోసం కోర్ కమిటీ ఏర్పాటు చేసి, సంధాన కర్తగా జైపాల్ రెడ్డిని నియమించుకుంటామని సీనియర్ నేత కె.కేశవరావు పేర్కొన్నారు. జైపాల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని విహెచ్ అన్నారు. రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర రెడ్డి తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు జైపాల్ తప్ప మరొకరు లేరు. తెలంగాణలో కూడా ఆయనే ఆ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా జైపాల్నే తమ నాయకుడుగా భావిస్తున్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనూ అత్యధికులు ఇదే వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో బీసీలు, దళిత నేతలు ముందున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో జైపాల్ కీలక పాత్ర పోషిస్తారని చెబుతున్నారు. అందువల్ల తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా కొత్త సామాజిక సమీకరణలకు దారి తీస్తోంది. ఆయన చొరవను బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలు సైతం ఆమోదిస్తున్నట్టుగానే కనిపిస్తోంది.