కెసిఆర్ దిమ్మ తిరిగింది
తెలంగాణలో కెసిఆర్ను ఒంటరి చేసి తమ తమ పార్టీలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రెండు పార్టీల నాయకులు పనిచేస్తున్నారు. తెరాస ఏకపక్ష విధానాలను, తెరాస చెప్పుచేతల్లో నడుస్తున్న కోదండరామ్ పద్ధతిని వారు వ్యతిరేకిస్తున్నారు. నిష్పక్షపాతంగా, సమిష్టి నిర్ణయాలకు అవకాశం ఇచ్చే కొత్త తెలంగాణ జెఎసిని ఈ రెండు పార్టీల నాయకులు కోరుతున్నారు. తద్వారా తెరాసను పక్కకు నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ రాజీనామా చేసిన నాయకులను తన గొడుగు కింద ఏకం చేయాలనే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనను కాదని అనకుండానే కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ నాయకులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.
రాజీనామాలు చేసిన వెంటనే తెలుగుదేశం నాయకులు బస్సు యాత్ర చేపట్టి తెలంగాణ పట్ల తాము చిత్తశుద్ధిని ప్రదర్శించామని చెప్పుకుంటూ గత వైభవాన్ని పొందే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ రాజీనామాల ద్వారా తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని నిరూపించుకున్నామని వారు ప్రజలకు చెబుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో పర్యటించడం పెద్ద గగనంగా ఉంటూ వచ్చింది. రాజీనామాలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. రాజీనామాలు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులను తమతో కలుపుకోవడానికి తెరాసనే కాదు, తెలంగాణ జెఎసి కూడా మీనమేషాలు లెక్కించింది. తప్పనిస్థితిలో తెలంగాణ జెఎసి తెలుగుదేశం ప్రాంత శానససభ్యుల రాజీనామాలను ఆహ్వానించింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేత తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటింపజేయాలనే డిమాండు రాజీనామాలతో వెనక్కి పోయింది.
మొత్తం మీద, తెలంగాణ ఉద్యమానికి తామే నాయకులమని చెప్పుకుంటూ వస్తున్నన తెరాసను దెబ్బ తీయడమే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల అభిమతంగా కనిపిస్తోంది. ఈ స్థితిలో కెసిఆర్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి. కెసిఆర్ ఆత్మరక్షణలో పడినట్లే కనిపిస్తున్నారు.