అబ్బాయ్ వైపు వైయస్ వివేకా చూపు?

తన భవిష్యత్తు అంధకారంలో పడిన నేపథ్యంలో వైయస్ వివేకానంద రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, తన సోదరుడి కుమారుడు వైయస్ జగన్ వైపు చూస్తున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాంగ్రెసులో ఉండాలా, వైయస్సార్ కాంగ్రెసులో చేరాలా అనే మీమాంసలో ఆయన చిక్కుకున్నారని అంటున్నారు. వైయస్ జగన్ ఆహ్వానిస్తే వెళ్దామా అనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆయనను పెద్దగా లెక్క చేయడం లేదని పుకార్లున్నాయి. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైయస్ జగన్, వైయస్ విజయమ్మ గెలిచిన తర్వాత, వైయస్ వివేకానంద రెడ్డి ప్రభావం పులివెందుల నియోజకవర్గంలో నామమాత్రమే అని తేలిన తర్వాత ఆయనను పట్టించుకోవడానికి కుటుంబ సభ్యులు ఇష్టపడడం లేదని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పులివెందుల నుంచి గెలిచినా స్థానిక ప్రజలకు వైయస్ వివేకానంద రెడ్డినే సన్నిహితంగా ఉండేవారు. ప్రజలు వైయస్ వివేకానంద రెడ్డి వద్దకే వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అందరూ ఆమె వద్దకే వస్తున్నారు. దీంతో పులివెందుల ప్రజలకు కూడా ఆయన దూరమయ్యారు. కాంగ్రెసు అధిష్టానం పట్టించుకోక, ప్రజలకూ దూరమై వైయస్ వివేకానంద రెడ్డి ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. కడప జిల్లాలో కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయడం కూడా సాధ్యం కాదని అంటున్నారు.


Click it and Unblock the Notifications