హిందూపురం నుంచి బాలయ్య: సీనియర్లు లోకసభకు

బలమైన అభ్యర్థులను రంగంలోకి తెచ్చే ప్రయత్నంలో కొన్ని సీట్లకు పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులను రంగంలోకి తెచ్చే ఆలోచన ఆ పార్టీలో జరుగుతోంది. కొన్ని సీట్లలో ఆసక్తికరమైన పేర్లు కూడా ఆ పార్టీ పరిశీలనలో ఉన్నాయి. సినీ హీరో, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణను అనంతపురం జిల్లా హిందూపురం లోక్సభ స్థానం నుంచే పోటీకి నిలిపే విషయమై ఆలోచన నడుస్తోంది. గత ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకొంది. సంప్రదాయకంగా టీడీపీకి బలమైన ఈ సీట్లో బాలయ్యను నిలపాలన్నది అధినాయకత్వ యోచన. అక్కడ కాని పక్షంలో విజయవాడ సీటుకు కూడా బాలయ్య పేరును పరిశీలించే అవకాశం ఉంది.
ఒంగోలు సీటుకు ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన శ్రీనివాస్ స్వస్థలం ప్రకాశం జిల్లా. ఆయన అక్కడ బలమైన అభ్యర్థి కాగలరని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీనియర్లను పోటీకి దింపే యోచనలో భాగంగా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడును ఈసారి కాకినాడ నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. అక్కడ కాని పక్షంలో విశాఖపట్నం నుంచి కూడా ఆయన పేరును పరిశీలిస్తారని అంటున్నారు.
విశాఖలో పోటీకి మాజీ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి ఆసక్తిగా ఉండటంతో ఆయనకు ప్రథమ ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. అనకాపల్లి లోక్సభ స్థానానికి మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల్లో ఒకరు అభ్యర్థి అయ్యే అవకాశముంది. సీనియర్ శాసనసభ్యుడు పి.అశోక్గజపతిరాజును ఈసారి విజయనగరం లోక్సభ స్థానానికి నిలపాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయన ఇప్పటికే సుదీర్ఘకాలం అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించినందువల్ల ఈసారి పార్లమెంటుకు పంపాలన్నది వారి సూచన.
అశోక్ ఏ కారణం వల్ల అయినా అంగీకరించపోతే అదే సామాజిక వర్గానికి చెందిన వారి పేరును కాకినాడ లోక్సభ స్థానానికి పరిశీలించే అవకాశం ఉంది. కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం వల్ల ఈసారి అక్కడ ఎవరిని నిలపాలన్న దానిపై పార్టీలో తర్జనభర్జన నడుస్తోంది. ఎర్రన్నాయుడు సతీమణిని శ్రీకాకుళం లోక్సభ స్థానంలో నిలపాలని ఆ జిల్లా నేతలు కొందరు ప్రతిపాదిస్తున్నారు. అది కుదరని పక్షంలో ఆమెను అసెంబ్లీకి నిలిపి ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పేరును పరిశీలనలోకి తీసుకోనున్నారు.
రాజమండ్రి సీటు నుంచి సినీ నటుడు మురళీమోహన్ పోటీచేయనున్నారు. ఏలూరు లోక్సభ స్థానానికి మాగంటి బాబు, నర్సాపురం లోక్సభకు జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతామహాలక్ష్మిని మళ్ళీ పోటీకి నిలపనున్నారు. విజయవాడ లోక్సభ సీటుకు కొత్త పేర్లు పరిశీలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్, ఫార్చ్యూన్ హోటల్ అధినేత మురళి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గుంటూరు సీటు నుంచి విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య పోటీచేసే అవకాశం ఉంది.
తెలంగాణలో కరీంనగర్ సీటు నుంచి మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి పేరు ఖరారైంది. మల్కాజిగిరి సీటు నుంచి కురమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒగ్గు మల్లేశం పేరు కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ ఎంపీ సీటుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, గత అభ్యర్థి సుధీష్ రాంభొట్ల, వక్ఫ్బోర్డు మాజీ అధ్యక్షుడు సలీం పేర్లు వినిపిస్తున్నాయి.
నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి ప్రస్తుత సిటింగ్ లోకసభ సభ్యుడు వేణుగోపాలరెడ్డి మళ్ళీ పోటీచేస్తారా లేదా అన్నది సస్పెన్స్గా ఉంది. అదే సీటు నుంచి వేణుకు బంధుత్వరీత్యా బావ అయ్యే రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి జగన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే ఆయనపై వేణుగోపాల్రెడ్డి పోటీచేయబోరని అంటున్నారు. అలాంటి పరిస్థితి వస్తే ఆ సీట్లో మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు పేరు పరిశీలనలోకి తీసుకొనే అవకాశం ఉందని అంటున్నారు.
మొత్తం మీద, లోకసభకు సీనియర్లను పోటీ చేయించడం వల్ల శాసనసభ స్థానాలను కూడా ఎక్కువగా గెలుచుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. లోకసభ స్థానాలను అధికంగా గెలుచుకుని ఢిల్లీ రాజకీయాలను శాసించాలని కూడా ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications