కాళ్లకు, పాదాలకూ బొబ్బలు: బాబు మొండిపట్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విపరీతమైన నొప్పులతో, బాధతో కూడా వస్తున్నా.. మీ కోసం పాదయాత్రను సాగిస్తున్నారు. యోగా, మితాహారం వంటి క్రమశిక్షణ జీవనశైలితో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఆయన పాదయాత్రతో దెబ్బ తింటున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్రాంతి తీసుకోవాల్సిన 63 ఏళ్ల వయస్సులో చావో రేవో తేల్చుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. వైద్యులు, పార్టీ నాయకులు చెప్పినా వినకుండా విశ్రాంతి తీసుకోకుండా పాదయాత్రను మొండిగా సాగిస్తున్నారు.
పట్టుదలకు మారు పేరైన చంద్రబాబు తాను అనుకున్నది చేసే వరకు నిద్రపోరు. అదే పాదయాత్రలోనూ కనిపిస్తోంది. కాళ్లు, పాదాలు బొబ్బలెక్కాయి. పెద్ద పెద్ద కాయలు కాశాయి. పట్టుకుంటే పగిలిపోతున్నాయి. పాదం పై నుంచి మోకాలి కింద వరకూ పట్టీలు కట్టుకునే నడుస్తున్నారు. పాదాలకు నూనె రాసుకుని, పౌడర్ వేసుకుంటున్నారు. ఇదీ ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తాకథనాలు.
విశ్రాంతి కోసం బస్సు ఎక్కే ముందు వేరొకరి సహాయం కావాల్సి వస్తోంది. ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ కేవలం పావుగంట మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఇప్పటి వరకు 1100 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. చంద్రబాబు పాదాలు, వేళ్లు గడ్డ కట్టుకుపోయాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. కాళ్ల మడమ నుంచి మోకాలి కింద వరకూ నొప్పి ఉండటంతో ఆయన అక్కడ పట్టీ కట్టుకున్నారు. గతంలో చంద్రబాబుకు షుగర్ లేదు, పాదయాత్రతో అది సతాయించడం ప్రారంభించింది.
షుగర్ 360 నుంచి పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ఒకసారి 360, ఇంకోసారి 340, మరోసారి 180, ఇంకోసారి 200 వరకూ ఉంటోంది. దీంతో ప్రతి గంటకు పది నిమిషాలు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం యోగా చేస్తున్నా, మళ్లీ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్సులు, మిగిలిన నాయకులతో మంతనాల వల్ల అసలు విశ్రాంతి అనేదే లేకుండా పోయింది. మహబూబ్నగర్లో వేదిక కూలడంతో దెబ్బ నడముకు చిన్పపాటి దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తీవ్రమైన శరీర అలసట వల్ల నేనున్నాంటూ అది గుర్తు చేస్తోందని అంటున్నారు. బస్సు ఎక్కేముందు సెక్యూరిటీ అధికారి భుజం ఆసరా తీసుకుంటున్నారు. పళ్ల బిగువున బాధ భరిస్తూనే బాబు పాదయాత్ర చేస్తున్నారని, ఆయన కష్టం చూస్తుంటే తమకే బాధగా ఉందని అంటున్నారు.
చంద్రబాబు తనను తాను కష్టపెట్టుకుంటూ పాదయాత్ర చేస్తుంటే పార్టీ నాయకులు కొంత మంది ఆయనకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నారు. ఎఫ్డిఐలపై ఓటింగుకు గైర్హాజరైన రాజ్యససభ సభ్యుల తీరు ఆయనకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించిందని అంటున్నారు. తనకు అండగా ఉండాల్సిన నాయకులు కొంత మంది మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నారని ఆయన ఆవేదన చెందుతున్నట్లు సమాచారం.