ఇక జగన్పై దృష్టి: ఢిల్లీ దూరం సాగిన బాబు
కానీ ఇప్పుడు టిడిపి ఓ అడుగు ముందుకేయడాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అయితే సిపిఐ, తెరాస పార్టీలు మినహా మిగతా పార్టీలు తమంత స్పష్టంగా చెప్పలేవని ఖరాఖండిగా చెప్పారు. టిడిపి నిర్ణయాన్ని స్వాగతించాల్సిందేనని చెప్పారు. సిపిఎం, కాంగ్రెసు ఎంపీలు కూడా స్వాగతించాయి. తెలంగాణ విషయంలో బాబుతో విభేదించి బయటకు వచ్చిన నాగం జనార్ధన్ రెడ్డి కూడా స్వాగతించారు.
దీంతో తెలంగాణ టిడిపిలో కొత్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంటే సీమాంధ్రలో నేతలు మౌనంగా ఉన్నారు. బాబు వైఖరిపై వారు ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. అదే సమయంలో ఇప్పటికే అక్కడ ఆపరేషన్ ఆకర్ష్తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిడిపి నేతలను బుట్టలో వేసుకుంటుంది. దీంతో అక్కడి తమ క్యాడర్ను రక్షించుకునే ప్రయత్నాల్లో చంద్రబాబు తన పాదయాత్రను జనవరి 26 తర్వాత కూడా పొడిగించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
వస్తున్నా మీకోసం పాదయాత్రకు మంచి ఆదరణ లభిస్తోందని, తెలంగాణలో అఖిల పక్షం తర్వాత టిడిపి కుదురుకున్నదని... ఇక సీమాంధ్రలో కుదురుకోవాల్సిన పరిస్థితి ఉందని పలువురు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారట. వస్తున్నా మీకోసం పాదయాత్రను సీమాంధ్రలో పొడిగిస్తే పార్టీకి మరికొంత ప్లస్ అవుతుందని చెబుతున్నారట. బాబు యాత్ర ద్వారా క్యాడర్కు విశ్వాసాన్ని కలిగించడం ద్వారా జగన్ వైపు వెళ్లకుండా మాత్రమే కాకుండా ఆ పార్టీ జోరుకు అడ్డుకట్ట వేసినట్లుగా ఉంటుందని భావిస్తున్నారట.
కాగా చంద్రబాబు ఇప్పటి వరకు ఢిల్లీ అంత దూరం నడిచారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ మధ్య ఉన్న దూరం 1400 కిలో మీటర్లు. చంద్రబాబు ఇప్పటికి సరిగ్గా అంత దూరం నడిచారు. శనివారం వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం, చిట్యాల మండలం టేకుమట్ల గ్రామం వద్ద చంద్రబాబు 1400 కి.మీ మైలురాయిని అధిగమించారని ఆ పార్టీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు.
శనివారంతో చంద్రబాబు యాత్ర 89 రోజులు పూర్తయింది. ఈ వ్యవధిలో ఆయన తొమ్మిది జిల్లాల్లోని 37 నియోజకవర్గాల పరిధిలో.. 74 మండలాలు, 13 మునిసిపాలిటీలు, 608 గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర వంద రోజుల మార్కును వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దులో పూర్తి చేసుకొనే అవకాశం ఉంది.