చిరుకు కౌంటర్: వైయస్ జగన్ పార్టీలోకి దాసరి?
కాంగ్రెస్కు కాపు ఓటు బ్యాంకు రోజురోజుకూ బలపడుతోన్న నేపథ్యంలో దానికి గండికొట్టే ప్రయత్నాలను వైయస్సార్ కాంగ్రెసు ప్రారంభించిందని అంటున్నారు.చిరంజీవి, పళ్లంరాజుకు కేంద్రమంత్రి వర్గంలో పెద్దపీట వేయడంతో పాటు, పిసిసి అధ్యక్షుడిగా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే ఉండడంతో కాపు ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ వెైపు వెళతాయని వైయస్ జగన్ ఆందోళనతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో దానికి విరుగుడు కనిపెట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా అదే కాపు వర్గంలో ఇమేజ్ ఉన్న వారిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా, కాపు ఓటు బ్యాంకును చీల్చాలన్న ఎత్తుగడతో జగన్ పార్టీ దూకుడుగా వెళుతోంది. దీంతో దాసరి నారాయణ రావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒత్తిడి పెంచినట్లు చెబుతున్నారు. ముందుగా మీరు చేరండంటూ దాసరి తన సన్నిహితులకు కొందరికి సూచించారని, అయితే అంతా కలసి వెళదామని వారు దాసరితో చెప్పినట్లు తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసులో చేరాలని దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్రంగా తనయుడు రాధాకృష్ణకు దాసరి నారాయణ రావే సలహా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దాసరితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి కూడా ఫిబ్రవరిలో జగన్ గూటికి చేరనున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తనకు బదులు తన సోదరుడి కుమారుడిని జగన్ పార్టీ అభ్యర్ధిగా బరిలో దింపనున్నారు.
సీబీఐ జాయింట్ డెైరక్టర్ లక్ష్మీనారాయణ కాల్డేటా కేసులో నిందితుడిగా ఉన్న వెైయస్ ఆత్మబంధువు కెవిపి రామచంద్రరావు వియ్యంకుడు రఘురామకృష్ణంరాజు కూడా జగన్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వెైయస్సార్ కాంగ్రెసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు సీటు ఇవ్వాలని నాయకత్వం చాలారోజుల క్రితమే నిర్ణయించిందని చెబుతున్నారు.
చిరంజీవికి కౌంటర్గా దాసరి నారాయణ రావు సరి తూగుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. దాసరి నారాయణ రావు కూడా చిరంజీవి రాకతో కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ప్రభావాన్ని దెబ్బ కొట్టడానికి తగిన సత్తా దాసరి నారాయణరావుకు మాత్రమే ఉందని చెబుతున్నారు.