ముందస్తు ఎన్నికలు: జగన్ పార్టీలో గుబులు
నిజానికి, లోకసభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు 2014 మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, లోకసభ ఎన్నికలను ముందుగానే నిర్వహించి, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను గడువు ప్రకారం నిర్వహించేలా చూడాలని కాంగ్రెసు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఐదారు నెలలు ముందుగా లోకసభ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెసు ఆలోచిస్తున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెసు ఆలోచనతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గుబులు రేగుతోంది. రెండు ఎన్నికలను ఒక్కసారి నిర్వహిస్తేనే తమకు అనుకూలంగా ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు ఆలోచన అని చెబుతున్నారు. లోకసభ ఎన్నికలు విడిగా జరిగితే ఎంపి సీట్లను గెలుచుకోవడం కష్టమనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఉన్నట్లు చెబుతున్నారు. పైగా, లోకసభ ఎన్నికల నాటికి వైయస్ జగన్ జైలు నుంచి బయటపడే అవకాశాలు కూడా లేవని అంటున్నారు.
కడప లోకసభ స్థానం నుంచి వైయస్ జగన్ ఇప్పటికే వైయస్ అవినాష్ రెడ్డిని పోటీకి దించనున్నట్లు ప్రకటించారు. దీంతో లోకసభకు వైయస్ జగన్ పోటీ చేసే అవకాశాలు దాదాపుగా లేవు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేయాలనే ఉద్దేశంతో జగన్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోకసభ స్థానానికి అవినాష్ రెడ్డి పేరును ఖరారు చేశారు.
వైయస్ జగన్ లేకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తగినన్ని లోకసభ స్థానాలు గెలుచుకుంటుందా అనేది కూడా అనుమానంగానే ఉంది. మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వంలో చేరాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, దాన్ని దెబ్బ తీసే విధంగా కాంగ్రెసు అధిష్టానం పావులు కదుపుతోందని అంటున్నారు.
జమిలి ఎన్నికలు జరిపితే శానససభ ఎన్నికలతో పాటు లోకసభ ఎన్నికలను స్వీప్ చేస్తామనే ధీమాతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులున్నారు. అయితే, రెండు ఎన్నికలు ఒకేసారి జరిగే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రత్యామ్నాయం గురించి కూడా వైయస్సార్ కాంగ్రెసు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. దానితో శాసనసభ రద్దయి, ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది.