సంకేతాలు: కెసిఆర్ విలీనం మాట కూడా
తెరాసను కాంగ్రెసులో విలీనం చేసే ప్రశ్న ఇప్పుడే ఉత్పన్నం కాదని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తే తాము కాంగ్రెసుకు మద్దతిస్తామని, కాంగ్రెసు తమతో చర్చలు ప్రారంభమైనప్పుడు ఆ విషయం ముందుకు వస్తుందని, ప్రక్రియ విడతలు విడతలుగా ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి తాము నిర్ణయం తీసుకున్నామని, చర్చలకు పిలువడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్రం నుంచి తనకు సంకేతాలు అందినట్లు ఆయన తెలిపారు. మీ మాటలో కచ్చితంగా లేదని అంటే కొద్ది వారాల క్రితం తనకు అటువంటి సంకేతాలు వచ్చాయని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రాంతంలో తమ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి కాంగ్రెసు చూస్తోందని, కేంద్రంలో ప్రయోజనాల దృష్టి ఆ దిశగా ఆలోచన చేస్తోందని, హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణను ఇస్తే కాంగ్రెసుకు మద్దతు ఇవ్వడానికి తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తమకు మనుగడ లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు.
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేసే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. చండీఘర్ హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో ఉందని, దానివల్ల ఇరు రాష్ట్రాలు దాన్ని పంచుకోవడానికి వీలైందని, హైదరాబాద్ పరిస్థితి అలా లేదని ఆయన అన్నారు. సీమాంధ్రుల హైదరాబాద్ రావాలంటే తెలంగాణలో దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తమకు సమ్మతం కాదని, చారిత్రక హైదరాబాద్ నగరం స్థానిక ప్రజల చెమట, రక్తంతో రూపుదిద్దుకుందని ఆయన అన్నారు. హైదరాబాద్కు వలస వచ్చిన సీమాంధ్ర ప్రజలు ఏడు శాతానికి, అంటే ఐదు లక్షల మందికి మించి లేరని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందని ఆయన అన్నారు.