జైలు నుండే జగన్ కంట్రోల్: మేకపాటికి క్లాస్?
జగన్ ఊచలు లెక్కిస్తున్నప్పటికీ మొదటి నుండి జైలులో తనను కలిసేందుకు వచ్చిన వారి ద్వారా పార్టీని కమాండ్ చేస్తున్నారట. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కూడా దీనిని అంగీకరిస్తున్నట్లుగా సమాచారం. పార్టీ మఖ్యనేత, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి ముఖ్యనేతకే జగన్ చివాట్లు పెట్టారట. మేకపాటి తెలుగుదేశం, కాంగ్రెసులలో పని చేశారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టలో ఉన్నారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయన టిడిపిలో ఉన్నప్పుడు గానీ, కాంగ్రెసులో ఉన్నప్పుడు గానీ ప్రజల్లో ఉన్న సందర్భాలు తక్కువేననే ఆరోపణలు ఉన్నాయి. ఆయన తనకు ఉన్న బిజినెస్ వ్యవహారాల దృష్ట్యా దేశవిదేశాలకు నిత్యం వెలుతుంటారట. తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా గడిపేస్తారట. అయితే ప్రజల్లో ఉండటం మాత్రం తక్కునే అనే విమర్శలు ఉన్నాయి. మళ్లీ ఎన్నికల ముందు కనిపిస్తారట.
అయితే ఇటీవల ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆయన తన ప్రయాణాలు అదేవిధంగా కొనసాగించడంతో వైయస్ జగన్మోహన్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చిందట. జైలులో తనను కలిసేందుకు వచ్చిన మేకపాటికి జగన్ క్లాస్ తీసుకున్నారని చెబుతున్నారు. నేనే ప్రజల్లో ఉండేందుకు ఓదార్పు, ధర్నాల పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టానని, మీకేమయిందని, ఇలా అయితే కష్టమని మేకపాటికి చెప్పారట. నిత్యం ప్రజల్లో ఉండాల్సిందేనని సూచించారట. జగన్ క్లాస్తో వెంటనే దిగొచ్చిన మేకపాటి ఇప్పుడు విదేశాల్లో పనులున్నప్పటికీ రోజు వ్యవధిలోనే వచ్చి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారట.