నందమూరి తారక రామారావు తర్వాత కిరణ్
అదే భూపతిపాలెం ప్రాజెక్టును రెండున్నర దశాబ్దాల తర్వాత ఏజెన్సీ పర్యటనలో భాగంగా కిరణ్ ప్రారంభించారు. అప్పట్లో ఎన్టీఆర్ రాత్రి బసకు టెంటుతో కుటీర ఏర్పాటు చేయగా నేడు కిరణ్ రాత్రి బసకు ముసురుమిల్లి గిరిజన ఆశ్రమంలోని ఓ గదిలో ఎసి ఏర్పాటు చేశారు. కిరణ్ వెంట మంత్రులు పితాని సత్యనారాయణ, తోట నర్సింహం తదితరులు ఉన్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగంలో కీలకమైన అధికారులంతా సిఎం వెంట ఉన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాత్రి తొమ్మిదన్నర గంటల ప్రాంతంలో ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలకు చేరుకున్నారు. చిన్నారులతో చాలాసేపు మాట్లాడారు. సౌకర్యాలు తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారి వారి సమస్యలను తెలుసుకొని వాటిపై హామీ ఇచ్చారు.
అనంతరం రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పదకొండు గంటల సమయంలో తనకు కేటాయించిన ఎసి గదికి వెళ్లి నిద్రకు ఉపక్రమించారు. అయితే నక్సలైట్లు ఉన్న ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి బస చేయడంతో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నాడు ఎన్టీఆర్ నేడు కిరణ్ కుమార్ బస చేయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.