జగన్కు కౌంటర్: కిరణ్ రెడ్డి ఇందిర బాట

రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర పర్యటన ముగిసినందున ఇకపై అధిష్ఠానానికి ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెడుతున్నారు. కాంగ్రెసు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను కూడా ముఖ్యమంత్రులే తీసుకుంటారు. వైయస్ రాజశేఖర రెడ్డి అంతా తానే అయి వ్యవహరించారు. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనపై, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు.
ఇందిరబాట, పల్లె నిద్ర కార్యక్రమాలను అధికారులతో చర్చించి ముఖ్యమంత్రి తయారు చేసుకున్నారు. తనకు సన్నిహితులైన కొందరు మంత్రులతోనూ మాట్లాడారు. వారు ఇచ్చిన సలహా మేరకు వారంలో మూడు రోజులు సచివాలయంలోనూ మరో మూడు రోజులు జిల్లాల్లోనూ పర్యటించాలని నిర్ణయించారు. సచివాలయంలో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించాలని, జిల్లా పర్యటనలలో తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కరించి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించాలని నిర్ణయించారు.
జిల్లా పర్యటనలో భాగంగా తొలిరోజున జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురించి జిల్లా కలెక్టర్తో సహా వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. రెండోరోజున నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఈ సమావేశానికి బూత్ స్థాయి నేతలను కూడా ఆహ్వానిస్తారు. మూడో రోజున ఆ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అదేవిధంగా రెండు మూడు రోడ్షోలు, జిల్లా కేంద్రాల్లో సభను నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమానికి సమగ్ర రూపకల్పన చేసి తీసుకురావాలని తన కార్యాలయ ఉన్నతాధికారులను మంగళవారంనాడు సీఎం ఆదేశించారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో ఈ కార్యక్రమంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీనేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications