జగన్, తెలంగాణ: పిసిసి అధ్యక్షుడిగా కెవిపి?
కాంగ్రెసులో తన ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు కెవిపి రామచందర్ రావు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. పార్టీపై పూర్తి ఆధిపత్యం రాహుల్ గాంధీకి రావడం, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన దిగ్విజయ్ సింగ్ కెవిపి రామచందర్ రావుకు సన్నిహితులు కావడం ఈ పరిణామాలకు దారి తీసిందని అంటున్నారు. దిగ్విజయ్ సింగ్ అండదండలతో పార్టీ పగ్గాలను తన చేతికి తీసుకునేందుకు కెవిపి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
వైయస్ రాజశేఖర రెడ్డి వర్గం పార్టీని వీడకుండా చూసేందుకు కూడా కెవిపి రామచందర్ రావు పనికి వస్తారని అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైయస్ అనుచర గణాన్ని తన పలుకుబడితో కెవిపి రామచందర్ రావు కట్టడి చేసి, వలసలను నిరోధించగలరని కూడా అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితో కలిసి రెండు సార్లు నియోజకవర్గాలవారీగా కసరత్తు చేసిన కెవిపి రామచందర్ రావు ఎన్నికల సమయంలో బాగా పనికి వస్తారని అంటున్నారు.
అయితే, కెవిపి రామచందర్ రావును తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైయస్ జగన్ కోవర్టుగా కెవిపి పనిచేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణను అడ్డుకోవడానికే కెవిపి రామచందర్ రావు ప్రయత్నాలు సాగిస్తున్నారని, అటువంటి నేత పిసిసి అధ్యక్షుడిగా వస్తే తాము సహించేది లేదని వారంటున్నారు.