తెలంగాణ భయం: పరకాలకు లగడపాటి డుమ్మా

ఒకవిధంగా చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కూతురు షర్మిల, పార్టీ నేతల పైన బొత్స, చిరు, కిరణ్ల కంటే ఘాటైన విమర్శలు చేస్తున్నారు. వారు సంధిస్తున్న ప్రతి ప్రశ్నకు అంతే ధీటుగా ప్రచారంలో భాగంగా చెబుతూనే వారి పైన ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు ఎన్ని సీట్లలో గెలిచినా ఆ గెలుపులో లగడపాటి పాత్ర కూడా ఉంటుందని కాంగ్రెసు నేతలు ఖచ్చితంగా చెప్పగలరు. అంతటి స్థాయిలో ఆయన ప్రచారంలో దూసుకు పోతున్నారు.
అలాంటి లగడపాటి సీమాంధ్రలోన్ని అన్ని నియోజకవర్గాలలో ప్రజాహిత పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతున్న ఒకేఒక నియోజకవర్గం వరంగల్ జిల్లా పరకాలకు మాత్రం ఆయన రాలేదు. ప్రజాహిత పాదయాత్ర ప్రారంభానికి ముందు, ప్రారంభించాక కూడా ఆయన తాను పరకాలలో కూడా పాదయాత్ర నిర్వహిస్తానని చెప్పారు. తెలంగాణవాదులు అడ్డుకుంటారేమోనని ప్రశ్నించగా... తాను మొదటి నుండి తన వాదం ఖచ్చితంగా చెబుతున్నానని అలాంటప్పుడు అడ్డుకునే ప్రసక్తి ఉండదని చెప్పారు.
పరకాలలో ఖచ్చితంగా పర్యటించి తీరుతానని ఇటీవల వరకు ప్రకటించిన లగడపాటి మాత్రం ఆదివారంతో ఉప ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి కూడా పర్యటించలేదు. తెలంగాణవాదులు తనను అడ్డుకునే అవకాశం ఎక్కువగా ఉందని భావించే లగడపాటి పరకాల పర్యటనకు రాలేదని అంటున్నారు. తెలంగాణపై నిర్ణయం చెప్పని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, షర్మిలను అడ్డుకుంటామని పలువురు తెలంగాణవాదులు హెచ్చరించారు.
అయితే వారికి అంతగా తెలంగాణవాదుల నుండి ఎదురుదెబ్బ తగలలేదు. అయితే తొలి నుండి సమైక్యవాదం వినిపిస్తున్న తనను మాత్రం తెలంగాణవాదులు ఖచ్చితంగా అడ్డుకుంటారని భావించే ఆయన పరకాలకు రాలేదని అంటున్నారు. అంతేకాకుండా ఆయన తన ఉప ఎన్నికల ప్రచారంలో సమైక్యవాదానికి పదును పెట్టారు. ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రం సమైక్యంగా ఉండే విధంగా కాంగ్రెసు నిర్ణయం తీసుకునే విధంగా చూస్తామని ఆయన చెబుతున్నారు.
అలాంటి వ్యాఖ్యలు చేసిన తనను తెలంగాణవాదులు ఖచ్చితంగా అడ్డుకుంటారని ఆయన భావించి ఉంటారని అంటున్నారు. అంతేకాకుండా ఆయనకు సొంత పార్టీ నేతల నుండి కూడా సహకారం లభించదు. ఇలాంటి సమయంలో పరకాల నియోజకవర్గానికి రాకపోవడమే మంచిదని లగడపాటి ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన పర్యటిస్తే పార్టీ అభ్యర్థి పైన వ్యతిరేక ప్రభావంపడే అవకాశముంటుందని కూడా పలువురు నేతలు లగడపాటికి సూచించారని తెలుస్తోంది. తెలంగాణవాదం పేరుతో వెళ్తున్న అభ్యర్థికి లగడపాటి మద్దతు పలికితే నష్టం జరుగుతుందనే నేతల భయంతోనే ఆయన వెనక్కి తగ్గి ఉండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications