నెపం వైయస్ మీదికి: జగన్పై ఆక్రోశం
ధర్మానకు సంఘీభావం ప్రకటిస్తూనే ఎవరో తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు మనం బలి అవుతున్నామని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్లోని ధర్మాన నివాసంలో పలువురు మంత్రులు ఆయనను కలిశారు. వాన్పిక్ వివాదం, భూ కేటాయింపుల విషయంలో జరిగిన వ్యవహారంపై మాట్లాడుకున్నారు ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది ఒకరైతే వాటికి బలి అవుతున్నది మరొకరనే అభిప్రాయపడ్డారు.
ఆ నిర్ణయాలు తీసుకున్న వైయస్ ఇప్పుడు లేరని, అందుకే సీబీఐ తనను కుట్రదారుగా అభివర్ణిస్తోందని ధర్మాన ప్రసాదరావు అంటున్నట్లు తెలుస్తోంది. బుధవారం మంత్రి ధర్మానను కలిసిన వారిలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కోండ్రు మురళి, అహ్మదుల్లా, ఉప సభాపతి బట్టి విక్రమార్క తదితరులు ఉన్నారు. వీరంతా వేర్వేరుగా ధర్మానను కలిశారు. సబిత, ధర్మాన మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగిందని సమాచారం.
"వైఎస్ హయాంలో నిర్ణయాలు ముందుగానే జరిగిపోయేవి. వాన్పిక్ విషయంలో నేను ఏ తప్పూ చేయలేదు.నాపై మోపిన అభియోగాల్లో పస లేదు. నేను వ్యక్తిగతంగా లబ్ధిపొందలేదు. ఎవరినీ వ్యక్తిగతంగా కలసి మాట్లాడలేదు.'' అని చెప్పుకొచ్చినట్లు గురువారం పత్రికల్లో వార్తుల వచ్చాయి. సిబిఐ తనను కుట్రదారునిగా పేర్కొనడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన అభిప్రాయాలతో సబిత కూడా ఏకీభవించారు. తమను అవినీతి మంత్రులంటూ ప్రతిపక్షాలు, మీడియా పేర్కొనడం పట్ల సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆస్తులపై విచారణ జరిపితే ఎవరెంత కూడ బెట్టుకున్నదీ ప్రజలకూ అర్థమవుతుందని సిబిఐకి సూచించినట్లు చెప్పారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గాంధీభవన్ నుంచి తన నివాసానికి వెళ్తూ మంత్రుల క్వార్టర్లలోని ధర్మాన నివాసానికి వెళ్లారు. ఇద్దరూ పది నిమిషాలపాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. రాజీనామా సమర్పణ, ప్రాసిక్యూషన్కు అనుమతి కోరడం వంటి అంశాలు వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అంతకుముందే గాంధీ భవన్లో బొత్స మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వైయస్ జగన్ ధనాశకు మంత్రులు బలవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనవల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ధర్మానను కలిసి సంఘీభావం తెలిపిన మంత్రి కొండ్రు మురళి కూడా అంతకుముందు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఎవరో చేసిన తప్పునకు ధర్మానను బాధ్యుడిని చేయడం తగదని అన్నారు.