జయలలిత బాట వదిలి.. చేతులుజోడిస్తున్న బాబు!
పాదయాత్ర తొలిరోజే ఈ మార్పును చూపించి పార్టీ వర్గాలను కూడా ఆయన ఒక్కసారిగా విస్మయానికి గురి చేశారు. వాస్తవానికి, బయటకు ఎక్కడికి వెళ్లినా ప్రజలు కనిపిస్తే వారికి రెండు వేళ్లతో విక్టరీ సంకేతం చూపించడం చంద్రబాబు కొన్ని దశాబ్దాలుగాపాటిస్తున్న ఆనవాయితీ. ఆయనను చూడగానే సాధారణ ప్రజలు కూడా అవే రెండు వేళ్లను చూపించడం ఒక అలవాటుగా స్థిరపడిపోయింది. చంద్రబాబు ఈ విక్టరీ సంకేతాన్ని చూపించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇందిరా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుర్తుగా హస్తం వచ్చిన తర్వాత దానిని స్ఫురింపజేసేలా ఆ పార్టీ నేతలు అరచేతిని ఊపేవారు.
ఆ పార్టీకి ప్రత్యర్థిగా పుట్టిన టిడిపి నేతలకు దానికి భిన్నంగా ప్రజలకు ఎలా అభివాదం చేయాలన్నది పెద్ద సమస్యగా ఉండేది. తమిళనాడును ఆనుకొని ఉన్న చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన బాబు ఈ విషయంలో తమిళ తంబిలను ఆదర్శంగా తీసుకొన్నారు. అక్కడ జయలలిత పార్టీ అన్నాడిఎంకె గుర్తు రెండాకులు. దానికి గుర్తుగా జయలలిత మొదలుకొని ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లినా రెండు వేళ్లు చూపించేవారు. హస్తానికి ప్రత్యామ్నాయంగా ఇది బాగుందనుకొని బాబు అదే పద్ధతిని తానూ పాటించడం మొదలు పెట్టారు.
ఇక్కడ దానికి విక్టరీ సంకేతంగా పేరు పెట్టారు. సిఎంగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా బాబు సింబల్గా 'వి'గా స్థిరపడిపోయింది. కానీ, తొలిసారిగా పాదయాత్రలో బాబు విక్టరీ సంకేతాన్ని పక్కన పెట్టారు. ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసేటప్పుడు విక్టరీ సంకేతం చూపించడం సరైంది కాదని, దాని బదులు చక్కగా నమస్కారం చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించారు. బాబు అక్షరాలా ఆచరించి చూపించారు.
తొలిరోజు పాదయాత్రలో పార్టీ నేతలు, సాధారణ ప్రజలు అలవాటు కొద్దీ ఆయనకు విక్టరీ సంకేతాన్ని చూపిస్తున్నా బాబు మాత్రం వారికి నమస్కారం పెడుతూ సాగిపోయారు. అంతేకాకుండా బాబు ఎప్పుడూ సీరియస్గానే కనిపిస్తారు! అలాంటిది యాత్రలో ప్రారంభం నుండి నవ్వుతూ, ఆహ్లాదంగా కనిపించారు. తనను కలుస్తున్న వారి భుజాలపై చేతులు వేసి నవ్వుతూ మరీ పలకరిస్తున్నారు. అంతేకాదు.. రాజకీయ యాత్రకు భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్ రావడం కూడా గమనార్హం.