ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు మోగుతుందా?
బిజెపి ప్రధాన అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు ఇది వరకే ప్రచారంలో ఉంది. అయితే, గుజరాత్ ఫలితాలతో అది మరింత మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోద్రా సంఘటన నేపథ్యంలో మోడీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఓటేస్తారనే ప్రత్యర్థుల నమ్మకాన్ని గత ఎన్నికల్లోనే మోడీ దెబ్బ తీశారు. ముచ్చటగా మూడోసారి గుజరాత్లో బిజెపి పతాకను ఎగురేశారు. శంకర్ సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్ వంటి తలలు పండిన నేతలు కూడా మోడీని అడ్డుకోలేకపోయారు.
వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా బిజెపి నాయకత్వం నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెసు ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరు ముందుకు వచ్చింది. వచ్చే లోకసభ ఎన్నికలు మోడీకి, రాహుల్ గాంధీకి మధ్య సమరంగా మారుతాయని జాతీయ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా కోడై కూస్తోంది. ఈ స్థితిలో కూడా బిజెపి తన నిర్ణయాన్ని వెల్లడించడం లేదు.
అభివృద్ధి ప్రాతిపదిక మీదనే నరేంద్ర మోడీ గుజరాత్లో హ్యాట్రిక్ కొట్టారనే అంచనాలు సాగుతున్నాయి. మతం వంటి ఇతర విషయాలేవీ ఎన్నికలపై ప్రభావం చూపలేదని, నరేంద్ర మోడీ అభివృద్ధికి మాత్రమే ప్రజలు ఓటేశారని అంచనాలు సాగుతున్నాయి. గుజరాత్ అభివృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తే బిజెపి మంచి ఫలితాలు సాధించవచ్చునని అంటున్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాయని, అందుకే బిజెపి గుజరాత్లో మరోసారి గెలిచిందని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అంటున్నారు. మోడీ చిత్తశుద్ధితో చేసిన పనులను ఆ రాష్ట్ర ప్రజలు ఆదరరించారని ఆయన అన్నారు. మొత్తం మీద, మోడీ దేశానికి రోల్ మోడల్ అవుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.