అక్కపై బాలయ్య లేఖలో ట్విస్ట్: వెనుక లోకేష్?
టిడిపి కార్యాలయం నుండి విడుదలైన ఈ పత్రిక ప్రకటన బాలకృష్ణకు తెలియకుండానే వెలువడిందని, దీని వెనుక ఎవరున్నారని బాలయ్య ఆరా తీయగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తన అల్లుడు నారా లోకేష్ ఉన్నారని తేలారట. దీంతో బాలకృష్ణ తన అక్కకు ఫోన్ చేసి వివరణ కూడా ఇచ్చారట. అక్కా.. నేను నిన్ను అంతలేసి మాటలంటానా అని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారట. ఆ ప్రకటన విషయమే తనకు తెలియదని చెప్పారట. ఇదే విషయాన్ని తన సోదరుడు నందమూరి హరికృష్ణకు కూడా వివరించారట.
తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను కొద్దికాలంగా నారా లోకేష్ చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు చేస్తున్న కొత్త ఆరోపణలు, విమర్శలు కూడా లోకేష్ సూచించినవేనట. పథకాలు, వ్యూహరచనలు అన్నీ ఇప్పుడు లోకేష్ చూస్తున్నారని అంటున్నారు. బాలకృష్ణ లేఖను కూడా లోకేష్ తయారు చేయించి విడుదల చేయించి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం అంశం ఆ కుటుంబంలో తీవ్ర చిచ్చు రాజేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ విగ్రహానికి స్పీకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, పురంధేశ్వరికి లేఖ రాయడం, చంద్రబాబు నాయుడు దానిని క్యాష్ చేసుకోవాలని చూడటం, దగ్గుపాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరిలు కూడా అదే రీతిగా స్పందించడంతో వివాదం మరింత పెరిగింది. ఆ తర్వాత బాలయ్య లేఖ నందమూరి కుటుంబంలో మరింత చిచ్చు రాజేసింది.
ఆయన ఘాటైన పదజాలంతో అక్కకు లేఖ రాశారు. దీంతో రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహంతో పార్టీలకు, అల్లుళ్లకు ఏం సంబంధమని ఖరాఖండిగా చెప్పేశారు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి జయకృష్ణ కూడా తన సోదరిని అలా అంటుంటే తన రక్తం ఉడికిపోతోందన్నారు. మరోవైపు పురంధేశ్వరి టిడిపి అధినేతకు రాసిన లేఖ వెనుక ఓ శకుని ఉన్నారంటూ విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.