వాద్రాతో ప్రియాంక గాంధీ తెగదెంపులు?

వార్తా పత్రికల కథనాల ప్రకారం - ప్రియాంక కుటుంబంలో వివాదాలపై ఆమె తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ ఎంతో మనస్తాపంతో ఉన్నారని, వివాదాస్పదం కాకుండా ఈ వ్యవహారాన్ని ఏ విధంగా పరిష్కరించాలో యోచిస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న తమ అధికారాన్ని వియ్యంకుడి కుటుంబం దుర్వినియోగం చేసే అవకాశం ఉండవచ్చని, వాద్రా, ఆయన కుటుంబం చేసే పనులు తమ కుటుంబంతోపాటు పార్టీకీ మచ్చ తీసుకు వచ్చే ప్రమాదం ఉండవచ్చని సోనియా, ప్రియాంక పెళ్లి సమయంలోనే అనుమానించారు. అటువంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండేందుకు అప్పట్లోనే జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతారు.
వాద్రా, ప్రియాంకలు ఒకరిని మరొకరు ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వాద్రా తన వ్యాపార విషయాల్లో మరీ వేగం పెంచకుండా చూసేందుకు సోనియా, ప్రియాంక చాలా కాలం ప్రయత్నించారని చెబుతారు. ఆయన మీద ఎటువంటి వివాదాస్పద కథనాలూ రాకుండా చర్యలు తీసుకుంటూనే వచ్చారు. వాద్రా, ప్రియాంకలు 1997లో సోనియా నివాసంలోనే నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు. మొదట్లో, సోనియా అల్లుడిగా తన వల్ల వివాదాలు తలెత్తరాదనే ఉద్దేశంతో వాద్రా చాలా కాలం ఎవరి కంట్లో పడకుండా ఉండేవారు. ఎక్కడా ఎటువంటి సమస్యలూ సృష్టించకూడదన్న సోనియా ఉద్దేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని మసలుకున్నారని అంటారు.
వ్యాపారం విషయంలో ఏదో సహాయం కోరుతూ అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ను వాద్రా తండ్రి రాజేంద్ర, తమ్ముడు రిచర్డ్ కలుసుకున్నట్లు సమాచారం. అయితే, సోనియా ఆదేశాల మేరకు 'తండ్రితో, తమ్ముడితో తనకు ఎటువంటి సంబంధాలూ లేవని, తన పేరును ఉపయోగించుకోవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదంటూ' వాద్రా బహిరంగ నోటీసు ఇచ్చినట్లు చెబుతారు.
ఆ తర్వాత వాద్రా చెల్లెలు, తండ్రి, తమ్ముడి మరణాలూ మిస్టరీగా మారాయి. ఆ తర్వాత, అల్లుడిపై సోనియా పెట్టుకున్న నమ్మకం ఐదేళ్లలోనే వమ్మయింది. ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించారు. ఒకప్పుడు గిల్టు నగల వ్యాపారి అయిన వాద్రా రియల్ ఎస్టేట్, హోటల్, ట్రేడింగ్, ఎయిర్లైన్ తదితర కంపెనీలను ప్రారంభించారు. ఒక్క రియల్ ఎస్టేట్లోనే 14 కంపెనీలను నెలకొల్పారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ రాబర్ట్ వాద్రాపై హర్యానా భూములకు సంబంధించి ఆరోపణలు చేశారు.
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమయంలో అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో ప్రియాంకతోపాటు వాద్రా కూడా పర్యటించారు. ఈ సందర్భంగా తనకూ రాజకీయాల్లోకి రావాలనుందని వాద్రా ప్రకటించారు. ఆ వార్తను ప్రియాంక ఖండించారు. కానీ, వాద్రా మళ్లీ అదేమాట మరోసారి చెప్పారు. వాద్రాకు బ్రేకులు వేయడానికి తర్వాత సో నియా, ప్రియాంక చాలా శ్రమ పడినట్టు సమాచారం.
అదే సమయంలో భారత్ దుర్బల దేశమంటూ ఫేస్బుక్లో వాద్రా చేసిన వ్యాఖ్యలూ రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్న నేపథ్యంలో వాద్రా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మొత్తం మీద, వాద్రాకు దూరం జరిగేందుకు సోనియా కుటుంబం పూర్తిగా సిద్ధమైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications