జైల్లో జగన్ వంద రోజులు: ఆమరణ దీక్ష చేసేవారా?
అధికార ప్రతిపక్షాల కుట్ర ఫలించలేదని, రెండు ప్రధాన పార్టీలు కూడా చావు దెబ్బ తిన్నాయని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై సాక్షి కథనం వ్యాఖ్యానించింది. జగన్ దిశానిర్దేశంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పయనిస్తూ అనునిత్యం ప్రజా సమస్యలపై పోరు చేస్తోందని చెప్పింది. జనాభిమానాన్ని జైలు గోడలు నిలువరించగలవా, తమ తరఫున గళం వినిపించేందుకు నడచి వచ్చే నేతను జైలు గదిలో నిర్బంధించినంత మాత్రాన జనం మరువగలరా అంటూ ప్రశ్నలు గుప్పించింది.
అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలు వింటూ వాటిపై ప్రభుత్వాన్ని నిలదిస్తూ ప్రజా నాయకుడిగా ఎదిగిన జగన్ను జనం నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కయి ఒక్కడిపై పన్నిన కుట్రలు బెడిసికొట్టి ఆ పార్టీలనే నామరూపాల్లేకుండా చేశాయని, జగన్కు పెరుగుతున్న జనాదరణ, దినదిన ప్రవర్థమానవుతున్న పార్టీ, ఎన్నికల ఫలితాలు, సర్వేల అంచనాలు స్పష్టం చేయడం లేదా అంటూ దీర్ఘాలు తీసింది.
జగన్ జైలు పాలైన తర్వాత జరిగిన పరిణామాలను సాక్షి డైలీ ఆ వార్తాకథనంలో విశ్లేషించిందిద. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనాసరే లొంగదీసుకోవాలని ప్రయత్నించి భంగపడిన అధికార పార్టీ చివరకు సిబిఐని ఆయుధంగా చేసుకుని వేధించడం, అరెస్టు చేయించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ప్రజలు గ్రహించారని సాక్షి డైలీ వ్యాఖ్యానించింది. అందుకే ఆయన అరెస్టు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారని చెప్పుకుంది.
గడచిన మూడు నెలల కాలంలో జరిగిన పరిణామాలు చూస్తే అంటూ వివిధ వర్గాలు ఎదుర్కుంటున్న సమస్యలను సాక్షి డైలీ తన వార్తాకథనంలో క్రోడీకరిస్తూ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొడుతున్నారని, ప్రధాన ప్రతిపక్షం తూతూ మంత్రంగా ఆందోళనలు చేస్తున్నా వాటిలో సీరియస్నెస్ లేదన్న విషయాన్ని ప్రజలు గ్రహించారని వ్యాఖ్యానించింది. జగన్ బయట ఉండి ఉంటే ఇప్పుడు కరెంట్ కష్టాలపై ఆమరణ దీక్షకు దిగివారేమోనని వైయస్సార్ కాంగ్రెసు సీనియర్ నాయకుడొకరు అంటున్నారని ముక్తాయింపు ఇచ్చింది.