సీమాంధ్ర: బాలయ్య వర్సెస్ వైయస్ జగన్
సీమాంధ్రలో వైయస్ జగన్ వర్గానికి చెందినవారిపై అనర్హహత వేటు పడితే పెద్ద యెత్తున ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బాలకృష్ణ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. వైయస్ జగన్ను ఎదుర్కోవడానికి బాలకృష్ణ సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లు గెలుచుకోవడానికి తగిన ప్రాతిపదికను ఏర్పాటు చేయడానికి బాలకృష్ణ ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టారని అంటున్నారు. ప్రత్యక్షంగా ఆయన అభ్యర్థులను గెలిపించాలని ఇప్పుడే చెప్పకపోయినప్పటికీ రాను రాను ఆ ప్రచారాన్ని మొదలు పెట్టే అవకాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు తాను పూచీకత్తు ఉంటానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఉద్దేశం ఆయన ప్రకటనల్లో కనిపిస్తోందని చెబుతున్నారు.
ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే, వచ్చే ఉప ఎన్నికల్లో గ్లామర్, సత్తా కలబోసి ప్రచార పోరు జరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెసు తరఫున చిరంజీవి, తెలుగుదేశం తరఫున బాలకృష్ణ ఉప ఎన్నికల పోరుకు గ్లామర్ను అద్దనున్నారు. వైయస్ జగన్ మాత్రం తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలపై, సానుభూతిపై ఆధారపడి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తారు. జగన్కు సీమాంధ్రలో తగిన బలం ఉందని, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్వీప్ చేస్తుందని సర్వేలు తెలియజేస్తున్నాయి. దీంతో ఆయనను ఎదుర్కోపడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు.