పేలుడు వల్లే తమిళనాడు ఎక్స్ప్రెస్లో ప్రమాదం?
ప్రమాదానికి ముందు ఎస్-11 బోగీలో మూడుసార్లు పేలుడు శబ్దాలు విన్నామని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని వారు అంటున్నారు. ఆ తర్వాతే పొగ వ్యాపించిందంటున్నారు. పుకార్లు నమ్మవద్దని పోలీసులు, రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ప్రత్యక్ష సాక్ష్యుల కథనం మాత్రం పేలుడు జరిగినట్లుగా ఉండటం గమనార్హం. అదే బోగీలో ప్రమాదం నుండి బయటపడ్డ వారు కూడా తాము 40-44 బెర్తుల మధ్య బాణసంచా పేలిన శబ్ధం విన్నామని రైల్వే పోలీసులకు చెప్పారు.
ప్రయాణీకులు తెలిపిన వివరాల ప్రకారం... పవర్ ఫెయిల్యూర్కు ముందే ప్రమాదం కోచ్ మొత్తం వ్యాపించిందని, వెంటనే కంపార్టుమెంట్ అంతా పొగ వ్యాపించిందని చెప్పారు. ప్రకాశ్ సింగ్ అనే 51 ఏళ్ల వ్యక్తి తాను 33వ బెర్తులో పడుకొని ఉండగా.. ట్యూబ్ లైట్ పేలిన శబ్ధం వినిపించిందని, దాంతో తాను తన బెర్త్ నుండి కిందకు దూకానని, తన పైన కొందరు ప్రయాణీకులు దూకారని చెప్పాడు.
అయితే ఇప్పటి వరకు అధికారులు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పలేక పోతున్నారు. విచారణ తర్వాతనే ఏదైనా చెబుతామంటున్నారు. మంగళవారం ఉదయం బోగీని ఫోరెనిక్స్ బోగీని పరిశీలించారు. నమూనాలు సేకరించారు. వీరు నివేదికను రైల్వే శాఖకు ఇవ్వనున్నారు.