డిఫెన్స్లో 'ఏకాకి' కెసిఆర్: 'జంప్' ప్లాన్ రివర్స్
దీంతో ఇన్నాళ్లూ టిడిపిని వీడి తెరాస వైపు వెళ్లాలనుకున్న పలువురు నేతలు ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారట. టిడిపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాక.. తెలంగాణపై కెసిఆర్ ఒంటెత్తు పోకడ తగ్గుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడటం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చేశారట. ఇన్నాళ్లూ టిడిపిని తెలంగాణపై కెసిఆర్, తెరాస ప్రశ్నించినప్పుడు ఇతరులు టిడిపి నుండే సరిగా ఎదురుదాడి ఉండేది కాదు. అఖిల పక్షంలో టిడిపి స్పష్టమైన వైఖరి ప్రకటించదని భావించిన కెసిఆర్ ఆ తర్వాత బాబుపై మరింత దాడి చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని భావించడమనే కాకుండా.. జంపింగ్స్ మరింత పెరుగుతాయని భావించారట.
కానీ అఖిల పక్ష సమావేశం తర్వాత టిడిపి తెలంగాణ నేతలు రెచ్చిపోతున్నారు. పార్టీ అధినేత తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పడంతో వారు ఇప్పుడు కెసిఆర్ను నిలదీస్తున్నారు. అంతేకాదు ఇతర ప్రజా సంఘాలు, పార్టీలు కూడా టిడిపిని కెసిఆర్ టార్గెట్గా పెట్టుకోవడాన్ని తప్పు పడుతున్నాయి. టిడిపి, కాంగ్రెసుల నుండి తమ పార్టీలోకి వస్తారని ఇన్నాళ్లూ భావించిన కెసిఆర్ ఇప్పుడు తన వ్యూహం ఎదురు తిరగడంతో ఆత్మరక్షణలో పడ్డారని అంటున్నారు.
అదే సమయంలో తెలంగాణ అంశంపై ఇన్నాళ్లూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన కెసిఆర్కు మిగిలిన పార్టీలు అన్నీ చెక్ చెప్పే దిశలో వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ సాధించాలనే భావనతోనే వారి వ్యాఖ్యలు ఉన్నప్పటికీ వారి చర్యలు కెసిఆర్ గుత్తాధిపత్యానికి గండి కొట్టేలా కనిపిస్తున్నాయి. ఇది కెసిఆర్కు రుచించక పోవచ్చునని చెబుతున్నారు. అన్ని పార్టీలు కలిసి తెలంగాణ కోసం ఉద్యమం చేయాలని పలు పార్టీలు పిలుపునిస్తున్నాయి.
కెసిఆర్కు ఇది జీర్ణించుకోలేని విషయమని అంటున్నారు. తెరాస బలోపేతం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తుంటే.. తెలంగాణపై అన్ని పార్టీలు కలిసి పోరు అనేది ఆయనకు రుచించక పోవచ్చునని అంటున్నారు. తెలంగాణకు ఏ పార్టీ వ్యతిరేకంగా చెప్పని కారణంగా అన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని భావించవచ్చునని, అలాంటప్పుడు ఆయా పార్టీలలోని తెలంగాణ ప్రజాప్రతినిధులను కలిపుకొని ఉద్యమించాలని కాంగ్రెసు, బిజెపిలతో పాటు తెలంగాణ జెఏసి కూడా యోచిస్తోందట.
టిడిపి వైఖరి స్పష్టంగా ఉందని ఇతర పార్టీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టిటిడిపిని కలుపుకొని వెళ్లకపోతే తెలంగాణపై చిత్తశుద్ధి లేదని తమను విమర్శించే అవకాశముందని జెఏసిలోని కొందరు నేతలు కూడా భావిస్తున్నారట. అన్ని పార్టీలు కలిసి పోరాడాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు పిలుపునిచ్చారు. టిడిపి కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉంది. ఈ నిర్ణయం కెసిఆర్ను ఏకాకి చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.