తెలంగాణ: కెసిఆర్కు వైయస్ జగన్ ఎర్త్?
తెలంగాణ విషయంలో జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కన్నా ఓ అడుగు ముందుకేశారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కానని, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాట్లాడబోనని చంద్రబాబు కాస్తా తెలంగాణ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తే, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తాము తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామని జగన్ చెప్పారు. ఆ రకంగా తెలంగాణ ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి జగన్ చంద్రబాబు కన్నా ముందున్నారని చెప్పవచ్చు. అదే సమయంలో కెసిఆర్ కోటాను జగన్ పకడ్బందీగా బద్దలు కొడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కెసిఆర్ వ్యవహారశైలితో విసిగిపోయిన పలువురు తెలంగాణ నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారు. ఇంతకు ముందు కెకె మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప రెడ్డి వంటివాళ్లు జగన్ వెంట వెళ్లగా, తాజాగా గంగారెడ్డి, సంతోష్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇంతకు ముందు తెలంగాణ సమరయోధుడు కొమురం భీం మనవడు సోనేరావు తెరాసను వదిలేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ తెరాసలో చేరాతారని అనుకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెసు వైపే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోని ఒక సామాజిక వర్గం కెసిఆర్తో విసిగిపోయి, జగన్ను బలోపేతం చేయడానికి పనిచేస్తున్నట్లు కూడా వినికిడి. ఏమైనా, దీర్ఘకాల దృష్టితో చూస్తే జగన్ తెలంగాణ రాజకీయం కెసిఆర్ను దెబ్బ తీసేట్లే ఉంది.