చిరంజీవి మాటలు వారికి చేదు గుళికలు
చిరంజీవి మంత్రి అయిన తర్వాత శుభాకాంక్షలు తెలుపుతూ సి. కళ్యాణ్ ప్రకటనలు ఇచ్చుకున్నారు. ఆయనతో పాటు చిరంజీవిని కలిసి సినీ ప్రముఖులు - ఎటువంటి చిత్రాలు తీస్తున్నా ఏదో ఒక నెపంతో నిర్మాత, దర్శకులపై దాడి జరుగుతోందని, దీనివల్ల తెలుగు సినిమా తీయాలంటేనే భయంగా ఉందని, అభద్రతా భావంతో తల్లడిల్లుతున్నామని చెప్పుకున్నారట.
దానికి చిరంజీవి తాపీగా ఇలా సమాధానం చెప్పారని అంటున్నారు. సినిమాలు వినోద సాధనాలని, ప్రేక్షలతోపాటు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా తీయాలని ఆయన వారికి చెప్పాడట. ఈ మాటలు వారికి మింగుడు పడలేదని అంటున్నారు. గతంలో లేని గొడవలు ఇప్పుడు ఎక్కువవడానికి కారణం పరిస్థితుల ప్రభావమేనని చిరంజీవి వారికి చెప్పినట్లు సమాచారం.
చిరంజీవి మాటలు ఆచరణ సాధ్యమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమాకు కథంటూ ఉండాలి కదా, కథలో సమస్యలు చూపించాలి కదా, ఎటువంటి సబ్జెక్టు లేకుండా సినిమాలు తీయడం సాధ్యం కాదు కదా అంటున్నారట.
తెలంగాణ సమస్య వల్ల ఏ తరహా చిత్రాలు చేయాలో ఎటువంటి పేర్లు, క్యారెక్టర్లు పెట్టాలో అర్థం కావడంలేదని సినీ పెద్దలు ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. సున్నితమైన అంశాలు గనుక జాగ్రత్తగా మీరే ఆలోచించుకోవాలని చిరంజీవి వారికి సూచించారని అంటున్నారు.