జగన్పై తెరాస వైఖరి మార్పు వెనక?
కెసిఆర్ తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు తన గొంతు విప్పారు. పార్లమెంటులో సమైక్యవాద ప్లకార్డును ప్రదర్శించిన జగన్ మళ్లీ పార్లమెంటులో తెలంగాణవాణిని వినిపించాల్సిందేనని, అప్పటి వరకు తాము జగన్ను నమ్మబోమని చెప్పారు. జగన్ను తెలంగాణలో అడ్డుకుంటామని కూడా తెరాస నాయకులు కొందరు చెప్పారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను చూసినట్లే తాము జగన్ను సమైక్యవాదిగా చూస్తున్నామని వారు స్పష్టం చేశారు. దీని వెనక మతలబు ఏమిటనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన నేపథ్యంలో తెరాస నాయకులు మాట మార్చారనే వాదన వినిపిస్తోంది. అయితే, దాని కన్నా ఎక్కువగా జగన్తో కుమ్మక్కయినట్లు జరిగిన ప్రచారం తమకు ఎక్కువ నష్టం చేకూర్చే విధంగా ఉందనే గ్రహింపునకు వారు వచ్చినట్లు కనిపిస్తోంది.
వైయస్ జగన్కు కెసిఆర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం తెలంగాణలో మొదటి నుంచీ ఉంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఆ ప్రచారానికి బలం చేకూరే పరిస్థితి ఏర్పడింది. ప్రజల మనోభావాలకు భిన్నంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కూడా బలపడే పరిస్థితి వచ్చింది. దీంతో తెరాస నాయకులు మాట మార్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జగన్ రైతు దీక్ష పరిణామాలు ఎలా ఉంటాయనే విషయం ఆసక్తికరంగా మారింది.