టిటిడి చిచ్చు: రాయపాటికి జగన్ పార్టీ గాలం?
గతంలో టిటిడి చైర్మన్ పదవి పైన ఆయన బాగా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పదవి అప్పుడు కనుమూరి బాపిరాజును వరించింది. దీంతో రాయపాటి పార్టీ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కష్టించి పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. ఓ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అతనిని పిలిపించి కూల్ చేశారు. అయితే వచ్చేసారి అవకాశమిస్తామని సోనియా నుండి హామీ రావడం వల్లనే రాయపాటి అప్పుడు సైలెంట్ అయ్యారని చెబుతారు.
గతంలో పార్టీ అధిష్టానం హామీ నేపథ్యంలో ఈసారి రాయపాటి టిటిడి చైర్మన్ పదవి పైన బాగా ఆశలు పెట్టుకున్నారు. అయితే పెద్దలు మాత్రం మరోసారి కనుమూరికే అవకాశం కల్పించారు. దీంతో రాయపాటి కాంగ్రెసు పైన గుర్రుగా ఉన్నారు. శనివారం రాత్రి నుండి అతను పార్టీ నేతలకు అందుబాటులో లేరని చెబుతున్నారు. రాయపాటి అలక పాన్పు ఎక్కినందువల్లే అతను అజ్ఞాతంలో ఉన్నారని చెబుతున్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో భేటీ అయి ఏదో ఒక నిర్ణయం రాయపాటి తీసుకోనున్నారని తెలుస్తోంది.
అయితే అదే సమయంలో రాయపాటి అసంతృప్తిని గుర్తించిన వైయస్సార్ కాంగ్రెసు అతనిని తమ పార్టీలోకి తీసుకు రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. గుంటూరు జిల్లాలో రాయపాటి బలమైన నేత. అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకు వస్తే పార్టీకి ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు భావిస్తున్నారట. దాంతో అతని అసంతృప్తిని గుర్తించిన వారు తమ వైపుకు రప్పించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే రాయపాటి వర్గం మాత్రం జగన్ పార్టీలోకి వెళ్లడం సరికాదని సూచిస్తున్నారని తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.