పరువు దక్కినా కెసిఆర్కు ప్రమాద హెచ్చరికలే
మహబూబ్నగర్లో తెరాస ఓడిపోవడం కెసిఆర్ నాయకత్వ వైఖరిని సవాల్ చేస్తోంది. బిజెపికి ఆ సీటు వదిలి ఉంటే కెసిఆర్ నాయకత్వంపై గౌరవం పెరిగి ఉండేదని అంటున్నారు. కెసిఆర్ ఏకపక్ష వైఖరి, తెలంగాణవాదానికి తాను మాత్రమే ప్రవక్తననే కెసిఆర్ వైఖరి తెరాసను దెబ్బ తీసిందని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ కామారెడ్డిలో మినహా మిగతా స్థానాల్లో తన ప్రాబల్యాన్ని చాటుకుందనే చెప్పాలి. కెసిఆర్ చెప్పినట్లు తెలంగాణలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పడానికి వీలు లేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఒక రకంగా ఈ ఫలితాలు నైతిక స్థయిర్యాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు.
కామారెడ్డిలో తెలుగుదేశం పార్టీ డిపాజిట్ గల్లంతయింది. అయితే, కామారెడ్డి, ఆదిలాబాద్ సీట్లు గతంలో తెలుగుదేశం పార్టీవి కావడం విశేషం. గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినవారే ఇప్పుడు తెరాస తరఫున పోటీ చేశారు. స్టేషన్ ఘనపూర్లో కాంగ్రెసు అభ్యర్థికి డిపాజిట్ గల్లంతైంది. ఉత్తర తెలంగాణలో తెలంగాణవాదం బలంగా ఉండడం వల్లనే తెరాస కాస్తా గౌరవంగా బయటపడిందని చెప్పాలి. మొత్తం మీద కెసిఆర్ తన వైఖరిని తిరిగి సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఉప ఎన్నికలు గుర్తు చేస్తున్నాయి. అలాగే, తెలంగాణ జెఎసి వైఖరిని కూడా ఈ ఉప ఎన్నికలు తెలియజేస్తున్నాయి.