ఉప పోరులో వైయస్ జగన్ స్వీప్ చేస్తే...?
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెసులోకి వలసలు ఉంటాయని, తెలుగుదేశం నుంచి కన్నా కాంగ్రెసు నుంచే ఈ వలసలు ఎక్కువగా ఉంటాయని, దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇస్తున్న శాసనసభ్యులు గవర్నర్ ముందు పరేడ్కు సిద్దపడవచ్చునని వార్తలు వస్తున్నాయి. కనీసం 25 మంది శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
ఉప ఎన్నికల్లో గత ఎన్నడూ లేని విధంగా ప్రచారం సాగింది. డబ్బులు కూడా విపరీతంగా ప్రవహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోటీ నువ్వా నేనా అనే స్థాయిలోనే ఉందని కూడా ఉంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో 300 కోట్ల రూపాయలకు పైగా ధన ప్రవాహం జరిగినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్కో సీటులో 20 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు జరిగినట్లు చెబుతున్నారు. కమ్యూనిటీ లీడర్ల చేతుల్లోకి పెద్ద యెత్తున డబ్బు చేరిందని విశ్లేషిస్తున్నారు. ఒక్కో ఓటుకు సగటున 2000 వేల రూపాయల చొప్పున ముట్టజెబుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఒంగోలు, రాయదుర్గం నియోజకవర్గాల్లో ఖర్చు ఎక్కువ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైయస్ జగన్ పార్టీకి 12కు తక్కువ కాకుండా సీట్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాల్లో 17 స్థానాలకు తిరిగి గెలవడానికి చెందినవారు జగన్ వర్గానికి చెందిన తాజా మాజీలు. ఈ 18 స్థానాల్లో 17 స్థానాలు గెలిస్తే అమలు చేయడానికి గేమ్ ప్లాన్ జగన్ వద్ద రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ అరెస్టు తర్వాత ప్రజల్లో సానుభూతి పెరిగిందని అంటున్నారు. అయితే, వైయస్ విజయమ్మ, షర్మిల ప్రచార సభలకు కనిపించిన ప్రజ మద్దతు ఒట్ల రూపంలోకి మారుతుందా, లేదా అనేది సందేహంగానే ఉంది.
జగన్ పార్టీ 17 సీట్లు గెలిచి, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి 25 మంది శాసనసభ్యులు జంప్ చేస్తే రాష్ట్రప్రభుత్వం అస్థిరతలో పడిపోతుందని అంటున్నారు. మొత్తం శాసనసభలో 294 సీట్లు ఉండగా, కాంగ్రెసుకు 154 సభ్యుల మద్దతు ఉంది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమైన తర్వాత అధికార పార్టీకి ఉన్న బలం అది. మజ్లీస్కు చెందిన ఏడుగురు సభ్యులు కాంగ్రెసు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. అయితే, ప్రభుత్వం పడిపోతుందా అంటే, కచ్చితంగా చెప్పలేం గానీ ప్రభుత్వం తీవ్రమైన సంక్షోభంలో పడిపోతుందని మాత్రం చెప్పవచ్చు
తమ తమ శాసనసభ్యులు విధేయత మార్చి జగన్ వైపు వెళ్తే అనర్హత వేటు కోసం స్పీకర్కు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. పోలీసులు ఉప ఎన్నికల సందర్భంగా దాదాపు 55 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 2009లో లోకసభకు, శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సొమ్ము 38 కోట్ల రూపాయలు మాత్రమే.